విస్త‌ర‌ణ‌కు అంతా ఓకే...కొత్త ట్విస్ట్

Update: 2017-03-09 05:59 GMT
ఎప్ప‌ట్నుంచో ఊరిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజున మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. దీనిపై పాలకపార్టీలో పెద్దఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక ఆశలు పెట్టుకున్న నేతలకు పలువురికి దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకు అవకాశం దక్కకపోవచ్చునని తెలిసింది. సీనియర్‌ నాయకుడు - మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం కల్పించవచ్చునని ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు - ఉప ముఖ్యమంత్రి-హోంశాఖ మంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొలుత చినరాజప్పకు పదవీ గండం ఉందని ప్రచారం జరిగినా, ఆయనకు ఎటువంటి గండమూ లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మంత్రి పదవి ఇస్తామన్న హామీతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల‌ నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మంత్రివర్గ విస్తరణలో జ్యోతులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా, గవర్నర్‌ చెక్‌ చెప్పినట్టు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వొద్దని సూచించారని తెలిసింది. మంత్రి పదవికి అవకాశం కోల్పోయిన జ్యోతులను ఎలా బుజ్జగించాలనే విషయంపై టీడీపీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. జ్యోతుల కుమారుడికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టి బుజ్జగించాలని చూస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ నేత గొల్లపల్లి సూర్యారావుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. జిల్లాలో బలమైన ఎస్‌ సీ సామాజిక తరగతి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నందున అవకాశమివ్వాలని చూస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News