ఆఖరి మ్యాచ్ లో అదరగొట్టేసిన రాయుడు

Update: 2023-05-30 10:02 GMT
ఐపీఎల్ ఫైనల్ కు కాస్త ముందుగా.. తన రిటైర్మెంట్ ను ప్రకటించిన అంబటి రాయుడు.. తన కెరీర్ లో చివరి మ్యాచ్ లో అదరగొట్టేశారు. మెరుపు ఆటతో ముగింపును చిరస్మరణీయంగా చేసుకున్నాడని చెప్పాలి.

గుజరాత్ జట్టుతో జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై జట్టు విజయంలో కీలకభూమిక పోషించారు. చెన్నై జట్టు ట్రోఫీని సొంతం చేసుకున్న మూడు సందర్భాల్లోనే జట్టుతో ఉన్న రాయుడు.. తాజాగా మరోసారి అదే మేజిక్ ను రిపీట్ చేశారని చెప్పాలి.

కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన రాయుడు.. క్రీజ్ లో ఉన్నంతసేపు మెరుపుషాట్లతో అలరించారు. ఫైనల్ పోరులో చెన్నై జట్టు 25 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చిన అంబటి రాయుడు.. 13వ ఓవర్లో మెహిత్ బౌలింగ్ లో వరుసగా 6, 4, 6 సాధించటం ద్వారా జట్టు లక్ష్యాన్ని తేలిక చేశారు. మూడు బంతుల్లో అతను సాధించిన 16 పరుగులు ఫైనల్ పోరులో చెన్నైను విజేతగా నిలిపేందుకు సాయం చేశాయి.

రాయుడు ఔట్ అయ్యే సమయానికి చెన్నై జట్టు చేతిలో 15 బంతులు ఉన్నాయి. కేవలం 23 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించాలి. ఐపీఎల్ లో ఇప్పటివరకు 204 మ్యాచ్ లు ఆడిన అతను 4348 పరుగులు చేశారు.

యాభైకు స్కోర్లను 23 సార్లు సాధించాడు. 2013, 2015, 2017లో ముంబయి తరఫు.. 2018, 2021, 2023లో చెన్నై జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి టోర్నీని సొంతం చేసుకున్న జట్టు తరఫున ఆడారు.

ఐపీఎల్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా ముందుగానే ప్రకటించిన అంబటి.. ఫినిషింగ్ మ్యాచ్ లోనూ తన సత్తా చాటటం ద్వారా.. ఘనంగా వీడ్కోలు పలికినట్లైంది.

Similar News