బాబు ఆదేశాల వ‌ల్లే...భార‌తీ పేరుతో కుట్ర‌

Update: 2018-08-12 09:03 GMT
``ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్‌ భారతి’’ అంటూ ఈనాడులో - ‘‘ముద్దాయిగా భారతి’’ అంటూ ఆంధ్రజ్యోతిలో వ‌చ్చిన వార్త‌లు అస‌త్యం - ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్న విమ‌ర్శ‌లప‌ర్వ‌మ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్ప‌ష్టం చేశారు. అసత్యాలు ప్రచారం చేసి రాష్ట్రాన్ని - యువతను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ సతీమణి భారతిపై కేసు నమోదు చేశారని ఆయ‌న ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీతో తాము లాలూచీ ఉంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్ముకు అయ్యింది ఎవరో అందరి తెలుసు అన్నారు. వైఎస్ ఆర్‌ సీపీ బీజేపీతో కుమ్మక్కు అయితే ఇలాంటి ఈడీ కేసులు ఎందుకు ఉంటాయని అంబ‌టి నిలదీశారు.

జ‌న‌నేత‌ వైఎస్ మృతి తర్వాత ఆయన కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ వైఎస్ భార‌తి పేరును ప్ర‌స్తావించ‌డ‌మ‌ని అంబ‌టి రాంబాబు తెలిపారు. భారతి మీద ఈడీ కేసు పెట్టడం - ఆమె ముద్దాయిగా చూపడం - ఆ రెండింటిని పత్రికల్లో వార్తలుగా ప్రచురించడం...ఇవ‌న్నీ అందులో భాగ‌మేన‌ని ఆయ‌న అన్నారు. ఓ వర్గం మీడియాలో భారతిపై వచ్చిన వార్తలపై జగన్ బహిరంగ లేఖ రాశారని చెప్పారు. త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆవేద‌న వ్య‌క్తం చేశార‌న్నారు. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్‌ కు వస్తున్న ఆదరణ చూడలేక చివరకు జ‌గ‌న్ స‌తీమ‌ణిని కూడా కోర్టుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందన్నారు. కాంగ్రెస్-టీడీపీ రెండూ కలిసి కేసులు వేసి అన్యాయంగా జగన్‌ ను వేధిస్తున్నాయని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. కొందరు చంద్రబాబు పెట్టే గట్టి తింటున్నారని అందుకే చంద్రబాబు - ఈడీ అధికారుల కాల్ డేటా బయటపెట్టాలన్నారు. జగన్ జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందనుకున్నారని, కానీ నిలబడేసరికి ఇలా తప్పుడు కుట్రలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు - కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేం సిద్ధమని అంబ‌టి స్పష్టం చేశారు.

వైఎస్ జ‌గ‌న్ లక్ష కోట్ల అవినీతిప‌రుడని ఆరోపించార‌ని - ఆ మాట మార్చేసి ఇప్పుడు రూ.43వేల కోట్లు అంటున్నారని ఇదే టీడీపీ నేత‌ల తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంబ‌టి వ్యాఖ్యానించారు. ఒక‌వేళ జ‌గ‌న్‌ పై వ‌స్తున్న అవినీతి విష‌యంలో ఆ మొత్తం చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ కేసులో రూ.1200 కోట్లపై మాత్రమే విచారణ జరుగుతోందని అంబటి తెలిపారు.  చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌ గా దొరికితే తప్పు కాదా అన్నారు. చంద్రబాబులా వ్యవస్థలను మేనేజ్ చేయడం తమకు రాదన్నారు. హెరిటేజ్‌లో జీతాలు ఎంత తీసుకుంటున్నారో లెక్కలు బయటపెట్టాలని చంద్రబాబు కుటుంబాన్ని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రుల తీరుపై అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి - పార్టీ మారి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. మా పార్టీ గుర్తుపై గెలిచి - మా పార్టీనే విమర్శించేందుకు ఆదికి సిగ్గు ఉందా అన్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రి కాదని - అబద్దాల శాఖ మంత్రి అన్నారు. తుని రైలును వైసీపీ గూండాలు తగులబెట్టారంటున్న అబ‌ద్దాలు మాట్లాడుతున్న య‌న‌మ‌ల తుని ఘటనలో ఇప్పటికీ దోషులను ఎందుకు తేల్చలేదనే విష‌యంపై స‌మాధానం ఇవ్వాల‌ని కోరారు. అధికారం టీడీపే దేనని - అయినా విచారణ ఎందుకు ముందుకు సాగటం లేదన్నారు. అబ‌ద్దాలు ప్ర‌చారం చేయ‌డంలో టీడీపీ నేత‌లు ఆరితేరార‌ని అంబ‌టి మండిప‌డ్డారు.
Tags:    

Similar News