రాష్ట్ర చ‌రిత్ర‌లో మ‌రొక‌రు రాయ‌లేని రికార్డు.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు మూడేళ్లు

Update: 2020-11-06 09:50 GMT
అధికారం అందిపుచ్చుకునేందుకు రాజ‌కీయ నేత‌లు అనేక ప్ర‌యోగాలు చేస్తారు. అయితే, వీటిలో చాలా మ‌టుకు రికార్డులు సృష్టించేవి త‌క్కువే. కానీ, చెర‌ప‌లేని రికార్డు.. చెదిరిపోని రికార్డు.. ఏపీ హిస్ట‌రీలో ఒక సువ‌ర్ణాధ్యాయంగా నిలిచిపోయే రికార్డును సొంతం చేసుకున్నారు.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో ఆయ‌న చేసిన సుదీర్ఘ పాద‌యాత్ర‌కు నేటితో మూడు సంవ‌త్స‌రాలు నిండాయి. అధికారంలోకి రావ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా న‌వంబ‌రు 6, 2017న జ‌గ‌న్ ఈ యాత్ర‌ను ప్రారంభించారు.

రాష్ట్రంలో 3,648 కిలోమీట‌ర్ల మేర అలుపెరుగ‌ని పాద‌యాత్ర చేసి.. రికార్డు సొంతం చేసుకున్నారు. నిజానికి వైఎస్ కుటుంబంలో మొత్తం ముగ్గురు పాద‌యాత్ర చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు 2004కు ముందు పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌.. అన్న పార్టీని బ‌లోపేతం చేసేందుకు పాద‌యాత్ర నిర్వ‌హించారు. కానీ, వీటిని మించిన రేంజ్‌లో జ‌గ‌న్ పాదయాత్ర చేసి.. చెదిరిపోని రికార్డును సొంతం చేసుకున్నారు. మొత్తం 14 నెల‌ల పాటు ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్యే తిరిగారు.

`నేను ఉన్నాను-నేను విన్నాను` నినాదంతో సాగిన పాద‌యాత్ర అఖిలాంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని జిల్లాల‌ను క‌వ‌ర్ చేసేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగారు. మ‌ధ్య‌లో కొన్ని ఆరోగ్య ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తినా .. వెన‌క్కి తిర‌గ‌కుండా.. ఆయ‌న ఈ యాత్రను ముందుకున‌డిపించి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తోనూ శ‌భాష్ అనిపించుకున్నార‌న‌డంలో సందేహం లేదు. దీని ఫ‌లిత‌మే.. 2019లో వైసీపీకి ఘ‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 130 నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌న పాద‌యాత్ర‌తో క‌వ‌ర్ చేసిన జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రించారు. ముద్దులు కురిపించారు.. భ‌రోసా క‌ల్పించారు.

ఈ ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో మొత్తం 124 బ‌హిరంగ స‌భ‌ల్లో ఆయ‌న ప్ర‌సంగించారు. అదేవిధంగా 55 సామాజిక వ‌ర్గాల వారు నిర్వ‌హించిన స‌మావేశాల్లోనూ త‌న గ‌ళాన్ని వినిపించారు. 341 రోజులు నిర్విరామంగా న‌డిచి.. త‌న వాణిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏపీ-ఒడిసాబోర్డ‌ర్ ప్రాంత‌మైన ఇచ్ఛాపురంలో ఈ పాద‌యాత్ర‌ను ముగించారు. అయితే, ఈ స్థాయిలో పాద‌యాత్ర నిర్వ‌హించే నాయ‌కులు క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌క‌పోవ‌డం.. జ‌గ‌న్ రికార్డును ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేర‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది.

పాద‌యాత్ర స‌మ‌యంలో తాను విన్న‌, క‌న్న స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న రూపొందించిన నాలుగు పేజీల మేనిఫెస్టో కూడా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందింది. అయితే, ఇది సంపూర్ణంగా అమ‌లు చేస్తున్నారా? అధికారంలోకి వ‌చ్చాక .. పాద‌యాత్ర స్ఫూర్తిని కొన‌సాగిస్తున్నారా? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. పాద‌యాత్ర ప‌రంగా మాత్రం జ‌గ‌న్ తిరుగులేని ప్ర‌జాభిమానాన్ని సొంతం చేసుకున్న నాయ‌కుడిగా ఏపీ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌నేది వాస్త‌వం. 
Tags:    

Similar News