వైసీపీలో ఆ సీట్లు ఖాళీ అవుతాయా?
ఇక, జనసేనలోకి రావాలని భావించినా.. అక్కడ కూడా నిన్నటి వరకు అలానే పరిస్థితి ఉంది. దీంతో జనసేన కూడా పెద్దగా ఎవరినీ చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. గత ఏడాది కాలంగా ఈ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎవరూ బయటకు రాలేదు. నిజానికి బయటకు రాలేకకాదు.. వారికి అవకాశాలు లేకనేనన్నది రాజకీయ వర్గాల విశ్లేషణలు. దీనికి కారణం.. ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న నాయకులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఏడాది కిందటే చంద్రబాబుగేట్లు మూసేశారు.
ఇక, జనసేనలోకి రావాలని భావించినా.. అక్కడ కూడా నిన్నటి వరకు అలానే పరిస్థితి ఉంది. దీంతో జనసేన కూడా పెద్దగా ఎవరినీ చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతోవైసీపీలో నాయకులు ముభావంగానే కొనసాగుతున్నారు. కానీ, వారికి `అవకాశం` వస్తే బయటకు రావాలని భావిస్తున్నారన్న విషయం జగన్కు కూడా తెలుసు. ఇటీవల కూడా జగన్.. ఈ వ్యవహారంపై స్పందించారు. పోయే వారిని ఎక్కడని ఆపుతాం.. అని వ్యాఖ్యానించినట్టు పార్టీ నాయకులు బాహాటంగానే చెప్పారు.
అంటే.. వైసీపీ నుంచి నాయకులు బయటకు వచ్చేందుకు రెడీగానే ఉన్నారన్నది బహిరంగ రహస్యం. దీనికి కారణాలు పెద్దగా ఎవరికీ తెలియనివి కూడా కాదు. పార్టీలో చైతన్యం లేదు. పార్టీ అధిపతిగా జగన్కు మార్కులు కూడా పడడం లేదు. విపక్ష నేతగా ఆయన ప్రజలను కలుస్తున్నది కూడా లేదు. పార్టీ అంతర్గత కుమ్ములాటలను కూడా పరిష్కరించడం లేదు. బెంగళూరు-తాడేపల్లి కుదిరితే విదేశాలకు పయనమవుతున్నారు. దీంతో వైసీపీలో నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయింది.
అలాగని అందరూ కాకపోయినా.. తటస్థ నాయకులు వైసీపీలో ఇమడలేక పోతున్నారు. వాస్తవానికి కరడు గట్టిన జగన్ అభిమానులుగా ముద్ర వేసుకున్నవారు కూడా.. గత ఎన్నికల తర్వాత.. టీడీపీ, జనసేనల్లో చేరారు. ఇక, తాజాగా జనసేన గేట్లు ఎత్తేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనికి సంబంధించి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీలో ముఖ్య నాయకులు, జగన్ వైఖరిని విభేదిస్తున్న వారు.. తమకంటూ.. ఓ వేదిక కావాలని కోరుకునే వారు జనసేన బాట పట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం.