మండలిలో కొత్త ఆట స్టార్ట్ చేసిన వైసీపీ... !
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై వైసీపీ నిన్న మొన్నటి వరకు చేసిన రగడ అందరికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ఈ విషయంపై పార్టీ వెనక్కి తగ్గింది.;
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై వైసీపీ నిన్న మొన్నటి వరకు చేసిన రగడ అందరికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ఈ విషయంపై పార్టీ వెనక్కి తగ్గింది. లడ్డూ వివాదాన్ని వదిలేయాలని పార్టీ నిర్ణయించినట్టు సీనియర్ నాయకుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని.. సూచించినట్టు కూడా చెప్పారు. వాస్తవానికి ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఈ విషయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో సభలో రసాభాస కూడా చోటుచేసుకుంది.
అయితే.. దీనిని ఎక్కువగా లాగడం ద్వారా హిందువుల ఓటు బ్యాంకు దూరం అవుతోందని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా ఓటు బ్యాంకు దిశగా ఈ వివాదం మారుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఈ విషయం నుంచి తప్పుకొంది. దీనిని గమనించిన వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనికి తోడు ప్రబుత్వం ఏకసభ్య కమిషన్ కూడా వేసిన నేపథ్యంలో ఈ కమిషన్ ఏం చేస్తుందో చూడాలని కూడా వైసీపీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ప్రధానంగా లడ్డూ విషయాన్ని ఇక్కడితో వదిలేకపోతే.. ప్రజల సమస్యలు వదిలేసిన పార్టీగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీపై విమర్శలు వస్తున్నాయి. వీటి నుంచి బయట పడడం ఇప్పుడు తక్షణ అవసరంగా వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఈ వివాదం నుంచి సాధ్యమైనంత వేగంగా బయటకు రావాలని వైసీపీ నిర్ణయించింది. తద్వారా ప్రజల సమస్యలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని భావిస్తోంది. అదేసమయంలో లడ్డూ వివాదాన్ని మరింత రెచ్చగొడితే తమకు ఇబ్బందేనని నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక నుంచి మండలిలో ప్రజల సమస్యల పై గళం వినిపించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో కాగ్ ఇటీవల ఇచ్చిన నివేదికలోని అంశాలను కూడా మండలి వేదికగా ప్రస్తావించనున్నారు. తద్వారా కూటమి సర్కారుపై పైచేయి సాధించాలన్నది వైసీపీ వ్యూహం. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నాయకుడు ఒకరు చెప్పడం గమనార్హం.