వివేకా హత్య కేసుపై సునీత మరో పిటిషన్.. సీబీఐ దర్యాప్తుపై అసంతృప్తి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె వైఎస్ సునీత మళ్లీ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె వైఎస్ సునీత మళ్లీ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగించేందుకు ఇటీవల ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే పరిమితంగానే దర్యాప్తునకు ట్రయల్ కోర్టు అనుమతించిందని, పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తనకు చాలా అనుమానాలు ఉండగా, ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణపైనే దర్యాప్తునకు ఆదేశించిందని సునీత తన పిటిషన్ లో తెలిపారు.
తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఆపేసిందని సునీత అనుమానిస్తున్నారు. తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి వివేకా మరణించార్న సమాచారం ఎప్పుడు తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? అన్న విషయాలపై స్పష్టత కావాలని సునీత గతంలో కోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ముగించిందని, కేసుకు సంబంధించిన మొత్తం కుట్రదారులు, సూత్రదారులను తేల్చాలని సునీత డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గతంలోనే సుప్రీంలో సునీత పిటిషన్ వేశారు. మూడు నెలల్లో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ట్రయల్ కోర్టుకు సూచించింది.
గత నెలలో సునీత పిటిషన్ పై తీర్పునిచ్చిన ట్రయల్ కోర్టు పరిమితంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 7వ నిందితుడు వైఎస్ భాస్కరరెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి, రెండో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ఇద్దరి టెలిఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో సునీత సందేహాలు లేవనెత్తిన మిగిలిన నిందితులపై విచారణకు కోర్టు అనుమతించలేదు. అంతేకాకుండా పాక్షిక దర్యాప్తును నెలరోజుల్లో ముగించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీత లేవనెత్తిన ప్రధాన సందేహాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోకపోలేదని, సుప్రీంలో పిటిషన్ వేశారు. హత్య జరిగిన రోజు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని, ఆయన మాజీ సీఎం జగన్ కు హత్యపై ముందే సమాచారం ఇచ్చి ఉంటారని సీబీఐ సందేహం వ్యక్తం చేసిందని, అయితే ఈ విషయంపై దర్యాప్తు జరపలేదని సునీత కోర్టుకు నివేదించారు. రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లం తన వాంగ్మూలంలో ఉదయం 5 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లో తాము జగన్ తో సమావేశంలో ఉండగా, భారతీ నుంచి జగన్ రెడ్డికి పిలుపువచ్చిందని, ఆ తర్వాత జగన్ రెడ్డి తమతో వివేకా మరణంపై చెప్పారని అజేయ్ కల్లాం వాంగ్మూలమిచ్చారు. ఇక్కడ భారతికి ఎలా సమాచారం వచ్చింది? ఎవరి నుంచి వచ్చిందన్న అంశంపై సీబీఐ దర్యాప్తు చేయలేదని, ఆ విషయంపైనా దర్యాప్తు కొనసాగాలని సునీత పిటిషన్ వేశారు.