మోడీకి జగన్ రిప్లై ఇస్తారా...భయపడతారా ?

ఒక విధంగా నరేంద్ర మోడీ జగన్ మీద ఇంతలా విమర్శలు సంధిస్తారు అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే జగన్ మీద ఆయనకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని కూడా ప్రచారం సాగింది.

Update: 2024-05-07 12:15 GMT

ఏపీకి వచ్చి వరసగా రెండు సభలు పెట్టి మరీ నరేంద్ర మోడీ జగన్ మీద గట్టిగానే విమర్శించారు. జగన్ ప్రభుత్వం అవినీతి అక్రమాలు చేసిందంటూ ఆయన ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏపీలో పాలన లేదని అన్నారు. అభివృద్ధి అంతకంటే లేదని అన్నారు. పోలవరం పాపాలు రాజధాని శాపాలు ఇలా అన్నీ జగన్ పాలన ఖాతాలో వేశారు.

ఏపీలో అయిదేళ్ళ పాలనలో జరిగింది అంతా సున్నా అని మోడీ చాలా స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు. ఒక విధంగా నరేంద్ర మోడీ జగన్ మీద ఇంతలా విమర్శలు సంధిస్తారు అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే జగన్ మీద ఆయనకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని కూడా ప్రచారం సాగింది. అదే టైం లో ఆయనకు టీడీపీ కూటమిలో బీజేపీ చేరడం ఇష్టం లేదని కూడా చెప్పుకున్నారు.

అయితే ఇలాంటి ప్రచారాలకు సందేహాలకు చెక్ పెడుతూ నరేంద్ర మోడీ రెండు సభలలో తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా తూర్పారా పట్టారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ షాక్ అయ్యేంతలా ఈ విమర్శలు ఉన్నాయి. అయిదేళ్ల క్రితం కానీ అంతకు ముందు కానీ నరేంద్ర మోడీ నోటి వెంట వైసీపీ మీద ఇలాంటి విమర్శలు ఎప్పుడూ విని ఉండవని వైసీపీ అయితే అయితే ఉలిక్కిపడింది అని అంటున్నారు.

ఆయన కంటే ఒక రోజు ముందు ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వైసీపీని చెడుగుడు ఆడేశారు. ఆయన అయితే వైసీపీ ప్రభుత్వం గూండాగిరి అన్నారు, అరాచక పాలన అన్నారు. చాలా దూకుడుగానే వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఇలా చూసుకుంటే మోడీ అమిత్ షా ఇద్దరూ ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకొనీయకుండా దుమ్మెత్తిపోశారు.

Read more!

అవి మామూలు విమర్శలు కూడా కావు. ఏపీ ప్రభుత్వం అవినీతిమయం అన్నారు. ల్యాండ్ శాండ్ లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది అని అన్నారు. అవినీతి పడగలు విప్పింది అని కూడా అన్నారు. అయిదేళ్ళ పాటు వైసీపీ మద్దతుని పెద్దల సభ రాజ్యసభలో తీసుకున్న ఈ ఇద్దరు నేతలు వైసీపీ మీద ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ విమర్శలు చేశారు.

అది ధర్మంగానే జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో ఎపుడూ బంధాలకు స్నేహాలకు తావు ఉండదు, యుద్ధం చేయాలనుకున్నపుడు అవతల వారు ఎవరు అయినా బాణం వేయాల్సిందే. ఆ విషయంలో మోడీ అమిత్ షా కరెక్ట్ గానే వెళ్లారు అని అంటున్నారు. మరి మొహమాటాలు ఏవీ బీజేపీకి లేవు. వైసీపీని ఓడిపోవాలని బలంగా కోరుకున్నారు. గట్టిగానే వారు జగన్ మీద అస్త్రాలు అన్నీ వేశారు. జగన్ ని మాజీ సీఎం ని చేయడానికి కంకణం కట్టుకున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి రానుందని కూడా జోస్యం చెప్పారు. మరి బీజేపీ తన వైపు నుంచి పేచీయే తప్ప రాజీ లేదని తేల్చేశాక జగన్ ఓడిస్తామని పట్టుదల పట్టాక వైసీపీ వైపు నుంచి ఎలాంటి శషబిషలకు తావు ఉండనే కూడదు, మరి జగన్ కూడా చంద్రబాబుని పవన్ ని ఎలా విమర్శిస్తున్నారో అంతకంటే ఎక్కువగానో తక్కువగానో బీజేపీని కూడా విమర్శించాల్సి ఉన్నది.

ఎందుకంటే వైసీపీని ఓడించాలని బీజేపీ చూస్తున్నపుడు ప్రజలకు క్యాడర్ కి బీజేపీ విమర్శల వల్ల ఒక రకమైన సందేశం వెళ్తున్నపుడు అడ్డుకుని ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరం వైసీపీ అధినేతగా జగన్ మీద ఉంది. మరి జగన్ మోడీకి అమిత్ షాకి వైసీపీ తరఫున గట్టిగానే ఇస్తారా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తారా అనందే ఇపుడు చర్చగా ఉంది.

4

విమర్శల సంగతి పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాల పుట్ట అని దారుణమైన కామెంట్స్ చేశారు. వాటిని అయినా డిపెండ్ చేసుకుంటూ వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వైసీపీ తరఫున ఈ జవాబులు చెప్పాల్సింది కచ్చితంగా జగన్ మాత్రమే. ఆయనే పార్టీ అధినేత, ఆయనే సీఎం గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అయిదేళ్ళ పాలన అంతా సాఫీగా ఉందని జనానికీ చెప్పుకోవాలి. బీజేపీని నిందించాలి.

మరి జగన్ ఆ పని చేస్తారా లేక బీజేపీతో ఎందుకు పెట్టుకోవడం అని భయపడి ఊరుకుంటారా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ కచ్చితంగా బీజేపీకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీని టీడీపీ విమర్శిస్తే వెంటనే జవాబు రెడీగా ఉంటుంది. మరి బీజేపీ దారుణంగా విమర్శించినప్పుడు అంతే ఘాటుగా జవాబు ఇవ్వాలి కదా అని అంటున్నారు. అలా కనుక ఇవ్వకపోతే రాంగ్ మెసేజ్ ఇటు పార్టీ శ్రేణులకు అటు ప్రజలకు వెళ్తుంది అని అంటున్నారు.

బీజేపీకి భయపడి తగ్గిపోయారు అని అనుకుంటారు అంతా. అంతే కాదు బీజేపీ చెప్పినట్లుగా అవినీతి ఆరోపణలు నిజమని కూడా భావిస్తారు. అపుడు వైసీపీకే భారీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీకి బీజేపీ చాలా ద్రోహం చేసింది. ఆ పార్టీకి ఏపీలో అసలు ఓటు బ్యాంకూ లేదు, చోటూ లేదు,

అలాంటి పార్టీ ఏపీలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోంది. వీరిని ఒకసారి వారిని ఒకసారి ఎత్తుతూ అందులో తన రాజకీయం పండించుకుంటోంది. బీజేపీ పట్ల ఏపీ జనంలో ఆగ్రహం ఉంది. ఈ కీలక సమయంలో జగన్ కనుక బీజేపీ మీద ధాటీగా విమర్శలు చేస్తే అది ఆయనకే కాకుండా రాష్ట్రానికి ఆయన పార్టీకి మేలు చేసేదిగానే ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏమి చేస్తారో.

Tags:    

Similar News