తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు యత్నం... తెరపైకి షాకింగ్ విషయాలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విజయనగరం ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.;

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విజయనగరం ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ట్రయల్ బ్లాస్ట్ లు జరిపి, ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపించి, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహ్మాన్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
అవును... తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ట్రయల్ బ్లాస్ట్ లు చేసి, వాటిని చూపించి, దేశవ్యాప్తంగా బ్లాస్ట్ లు చేయడానికి నిధుల్ని సమకూర్చుకునేందుకు సిరాజ్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికోసం "గజ్వా-ఈ-హింద్" పేరిట భారత్ పై యుద్ధమే లక్ష్యంగా అల్-హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) సంస్థను అతను ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.
ప్రధానంగా మత ఛాందసవాదం, తీవ్రవాద భావజాలం కలిగిన 50 మంది వరకూ ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు తేలగా.. అహింసను మరింతగా విస్తరించేందుకు ఇప్పటికే కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించిన సిరాజ్... దాన్ని గుజరాత్, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ కు విస్తరించే పనిలో ఉన్నట్లు వెల్లడైంది!
ఈ రిక్రూట్ మెంట్లే కాదు.. అహిం సంస్థను మరింత విస్తరించేందుకు, తద్వారా పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడానికి భారీగా నిధులు అవస్రమని సిరాజ్ భావించాడు. ఈ సమయంలో విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్ పై విద్వేషాన్ని రగిల్చే పలువురితో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ యాప్ ల ద్వారా టచ్ లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు సిరాజ్ కు పరిచయమయ్యారు.
ఇందులో భాగంగా... పాకిస్థాన్ లో నివసిస్తున్న బీహార్ వాసి అబూత్ హలేం తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్న పాకిస్థాన్ వాసి మసూబ్ అలీఖాన్ షేక్ లు పరిచయమయ్యారు. ఈ క్రమంలో తాము చెప్పినట్లు చెస్తే నిధులు సహా ఏమి కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్ కు వారు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అవసరమైతే అవసరమైన ఆయుధాలను నేపాల్ సరిహద్దుల్లో అందిస్తామని వారు సిరాజ్ కు చెప్పారని అంటున్నారు.
దీంతోపాటు.. బాంబులు తయారుచేయడం, పేలుళ్లు ఎలా జరపడం వంటి అంశాలపై డాక్యుమెంట్లను పంపించారు. ఈ నేపథ్యంలోనే వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్ట్ లు చేయాలని భావించి.. దానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంటున్నాడట. సరిగ్గా ఈ సమయంలోనే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) సమాచారం మేరకు విజయనగరం పోలిసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇక, బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్.. ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ల తయారీపై దృష్టి సారించాడని.. దీనికి లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్ తో కలిసి వీటి తయారీకి సన్నాహాలు చేశాడని చెబుతున్నారు. ఈ పేలుళ్లతో ఎక్కువ ప్రాణనష్టం కలిగించాలని భావించిన అతడు.. బేరింగ్ బాల్స్ ను పేలుడు పదార్థాలతో వాడాలనుకున్నాడు.
ఈ పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మపుర మొదలుకుని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇతడి అరెస్ట్ తో పెద్ద ప్రమాదమే తప్పింది!