నాడు హైదరాబాద్ను.. నేడు విశాఖను.. ‘బాబు’ మార్చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ.. ఆర్థిక దిశను సమూలంగా మార్చివేసే ఒక నవశకానికి విశాఖపట్నం వేదికవుతోంది.;
ఆంధ్రప్రదేశ్ రాజకీయ.. ఆర్థిక దిశను సమూలంగా మార్చివేసే ఒక నవశకానికి విశాఖపట్నం వేదికవుతోంది. మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ మ్యాప్పై నిలిపిన దూరదృష్టి గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అదే పంథాలో విశాఖను గ్లోబల్ టెక్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ రాక హైదరాబాద్ భాగ్యరేఖను మార్చినట్లే.. ఇప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి.. ఏఐ డేటా సెంటర్
విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ప్రతిపాదించిన సుమారు రూ. 1.3 లక్షల కోట్ల హైపర్స్కేల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా (ఎఫ్.డీఐ) రికార్డు సృష్టించనుంది. 1,000 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో నడిచే ఈ భారీ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతిపెద్ద డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా నిలవనుంది. ఇది కేవలం ఒక భవనం కాదు.. కృత్రిమ మేధ (ఏఐ) , క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలలో భారత్ను ప్రపంచ కేంద్రంగా మార్చే ఒక ఇంజిన్. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం ద్వారా విశాఖ కేవలం పరిపాలనా నగరం మాత్రమే కాదు.. గ్లోబల్ టెక్నాలజీ రాజధాని అని చాటిచెప్పారు.
గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా ఏపీ
గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఆర్సెలార్ మిట్టల్, రీన్యూ పవర్ వంటి దిగ్గజాల అడుగుజాడల్లో ఇప్పుడు గూగుల్ రాకతో రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు నమ్మకం రెట్టింపు అయ్యింది. ఈ భారీ పెట్టుబడితో విశాఖ పరిసర ప్రాంతాల్లో మూడు బృహత్తర టెక్నాలజీ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి. ఇవి ప్రపంచ స్థాయి క్లౌడ్ సర్వీసులు, ఏఐ ప్లాట్ఫారమ్లు, డేటా ప్రాసెసింగ్ సదుపాయాలను అందిస్తాయి. దీనివల్ల
స్థానిక స్టార్టప్లకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. నైపుణ్యం కలిగిన లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
లోకేష్ వ్యూహం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ఈ పెట్టుబడుల వెనుక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రవేశపెట్టిన "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానం పారిశ్రామిక వేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఫైళ్లు వేగంగా కదలడం.. పారదర్శకమైన అనుమతులు.. పారిశ్రామిక అనుకూల నిర్ణయాలు గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలు ఏపీని ఎంచుకునేలా చేశాయి. "మేము కేవలం కంపెనీలను ఆహ్వానించడం లేదు.. భవిష్యత్తును నిర్మిస్తున్నాం. విశాఖను గ్లోబల్ డేటా కాపిటల్గా మార్చడమే మా లక్ష్యం." అని లోకేష్ పేర్కొంటున్నారు.
గిగావాట్ స్థాయి ఏఐ హబ్గా ఆంధ్రప్రదేశ్
అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ వంటి స్వదేశీ దిగ్గజాల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే డేటా సెంటర్ల హబ్గా ఎదుగుతోంది. ఇప్పుడు గూగుల్ చేరికతో రాష్ట్రం గిగావాట్ స్థాయి ఏఐ పవర్హౌస్గా అవతరించనుంది. నాడు సైబరాబాద్ను సృష్టించిన అదే సంకల్పంతో నేడు విశాఖను "ఏఐ-సిటీ"గా మారుస్తున్న చంద్రబాబు నాయుడు విజన్.. రాబోయే తరాలకు స్వర్ణయుగాన్ని అందించబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. విశాఖ సముద్రపు అలల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మరో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది!