తొక్కిసలాట ఘటన... 15 రోజుల ముందే ఎలా చెప్పాడు?
అవును... తాజాగా కరూర్ లో జరిగిన భారీ తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో ఆనంద్ అనే పేరుతో గల ట్విటర్ అకౌంట్ లోని ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ చర్చనీయాంశంగా మారింది.;
తమిళనాడులో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సినీ నటుడు విజయ్.. తన టీవీకే పార్టీ పొలిటికల్ క్యాంపెయిన్ లో భాగంగా కరూర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 39 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. 15 రోజుల క్రితం కనిపిచిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... తాజాగా కరూర్ లో జరిగిన భారీ తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో ఆనంద్ అనే పేరుతో గల ట్విటర్ అకౌంట్ లోని ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 13 నాటి ఆ ట్వీట్ లో 'ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాట 50 మంది యువత బలయ్యే తొక్కిసలాట ఒక్కటైనా చూస్తాం. డీఎంకే కంటే 10 రెట్లు విషపూరిత, మతిలేని విజయ్ వల్లే ఇది జరుగుతుంది' అని అందులో రాసుకొచ్చారు.
దీంతో.. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇది విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా వేసిన ఒక అంచనానా.. లేక, విజయ్ ర్యాలీల సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శించే అవకాశం ఉందని ఊహించి చెప్పినా మాటా.. అదీగాక, మరేదైనానా అంటూ నెట్టింట ఈ ట్వీట్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. ఎవరి వెర్షన్ వాళ్లు వ్యక్తపరుస్తున్నారు! ఏది ఏమైనా... దీనిపై మిస్టరీ వీడాల్సి ఉందనే చర్చ మొదలవ్వడం గమనార్హం!
తమిళనాడు డీజీపీ కీలక వ్యాఖ్యలు!:
శనివారం రాత్రి కరూర్ లో జరిగిన తొక్కిసలాటకు గల కారణాలపై తమిళనాడు డీజీపీ వెంకటరామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఈ తొక్కిసలాటకు ర్యాలీలో నెలకొన్న రద్దీ, విజయ్ పర్యటనలో జాప్యం, ప్రాథమిక సౌకర్యాల కొరత కారణమని అన్నారు.
ఈ ర్యాలీ స్థలానికి విజయ్ మధ్యాహ్నం వస్తారని సోషల్ మీడియాలో ప్రకటించారని.. అయితే విజయ్ రాక ఆలస్యం కావడంతో పాటు జనం అంచనాలకు మించి పెరిగారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇవ్వగా.. విజయ్ అక్కడకు రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారని చెప్పారు.