బాబు మెచ్చిన మహిళా ఎమ్మెల్యే !

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరినీ ఒక పట్టాన మెచ్చుకోరు. ఎందుకంటే ఆయన పని రాక్షసుడు కాబట్టి.;

Update: 2025-06-16 04:29 GMT
బాబు మెచ్చిన మహిళా ఎమ్మెల్యే  !

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరినీ ఒక పట్టాన మెచ్చుకోరు. ఎందుకంటే ఆయన పని రాక్షసుడు కాబట్టి. ఆయన రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఎడతెరిపి లేకుండా వర్క్ బిజీ ఉన్నా ఆయన ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తారు. వయసు అన్నది ఆయనకు ఎపుడూ అడ్డు రాలేదు.

ఏడున్నర పదుల వయసులో ఉన్నా కూడా బాబు ఈ రోజుకీ కష్టపడుతుంటారు. అదే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆయన చెబుతూ దిశా నిర్దేశం చేస్తారు. అయితే ఎంత మంది అనుసరిస్తున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే మాత్రం తన పనితీరుతో బాబు కళ్ళలో పడ్డారు అని అంటున్నారు. ఆమె మహిళా ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పని తీరు బాబుకు నచ్చిందని అంటున్నారు. తొలిసారి 2024 లో ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డి రాజకీయంగా కోవూరులో దిగ్గజ నేత అయిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు. ఆమె ఏడాది కాలంగా చూస్తే నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.

ఆమె భర్త నెల్లూరు లోక్ సభ సభ్యుడు అయిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఏర్పాటు చేసిన వీపీఆర్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రశాంతి రెడ్డి కోవూరులో నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా మొత్తం మీద స్థానిక ప్రజలకు మంచి నీరు అందించడంతో పాటు కనీస సమస్యలను గ్రామాలలో తీర్చేలా ఈ సేవా సంస్థ పనిచేస్తోంది.

ఇపుడు ఈ సంస్థ ద్వారా కోవూరులో క్షేత్ర స్థాయిలో ప్రశాంతి రెడ్డి మరింత ఎక్కువగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నిరంతరం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతీ రోజూ ఆమె అందరినీ కలుస్తున్నారు. అలా కోవూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఏడాదిలోనే తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు అని అంటున్నారు.

కోవూరులో పేరుకుపోయిన అనేక సమస్యలను ఆమె పరిష్కరిస్తున్నారు. రోడ్లను బాగు చేయిస్తున్నారు. అలాగే మంచినీటి సదుపాయాలను గ్రామాలలో ఏర్పాటు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు అవసరమైన సాయం చేయడమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహితూ సాయం చేస్తున్నారు. దాంతో క్యాడర్ మొత్తం ఎమ్మెల్యే వైపు ఉంటోంది.

ఆమె కేవలం కోవూరులోనే కాకుండా ఎంపీగా భర్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గెలిచిన తర్వాత పార్లమెంట్ పరిధిలోని అనేక నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు అని అంటున్నారు. సేవా భావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంతి రెడ్డి తనకు ఉన్న సొంత నిధులను వెచ్చించి మరీ ప్రజలకు చేరువ అవుతున్నారు అని అంటున్నారు.

దీంతో కోవూరులో ఆమె తిరుగులేని నేతగా ఎదుగుతున్నారని ఆమె కనుక గట్టిగా పాతుకుని పోతే మాత్రం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎదురీతే అని అంటున్నారు. ఆమెను టీటీడీ పాలకమండలిలో మెంబర్ గా చేసింది కూటమి ప్రభుత్వం. దాంతో తిరుమల దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా కార్యకర్తల నుంచి సగటు ప్రజానీకానికి ఇస్తూ ఆమె ఆధ్యాత్మిక పరంగా చేరువ అవుతున్నారు.

ఇవన్నీ ఫీడ్ బ్యాక్ రూపంలో టీడీపీ అధినాయకత్వానికి చేరిపోయాయి. దాంతో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో తాజాగా నిర్వహించిన అ టెలి కాన్ఫరెన్స్ లో ప్రత్యేకించి ప్రశాంతి రెడ్డి ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలని కూడా బాబు అన్నారని ప్రచారం సాగుతోంది.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆమె జనంతో పార్టీ వారితో మమేకం అవుతున్న తీరు బాగుందని అందరూ దానిని అనుసరిస్తే పార్టీకి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డారని అంటున్నారు. ప్రశాంతి రెడ్డి పట్టుదల అంకితభావం అంతా నేర్చుకోవాలని బాబు చెప్పడం మీద అయితే టీడీపీలో చర్చ సాగుతోంది. మరి భవిష్యత్తులో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఏమైనా సిద్ధంగా ఉందా అన్న మాట కూడా అంతా అనుకుంటున్నారు

Tags:    

Similar News