రాజశేఖర్ రెడ్డి కొడుకు కోసం రంగంలోకి మరో ఇద్దరు రాజశేఖర్లు!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది.;

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019-24 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కోసం మరో ఇద్దరు రాజశేఖర్ లను రంగంలోకి దింపింది కూటమి ప్రభుత్వం. దీంతో రాజశేఖర్ రెడ్డి కొడుకు అరెస్టు కోసం మరో ఇద్దరు రాజశేఖర్లు పనిచేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ విన్నా, రాజశేఖర్ పేరున్న ఇద్దరు అధికారుల అడుగులు ఎలా ఉంటాయన్న చర్చే జరుగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. తన ఆరోపణలను రుజువు చేసేందుకు విచారణలు జరిపిస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా ఈ విచారణలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. అయితే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్ నే లక్ష్యంగా ప్రభుత్వం నియమించిన రెండు సిట్ బృందాలకు రాజశేఖర్ అనే పేరున్న అధికారులు నేతృత్వం వహించడం ఆసక్తికరంగా మారింది. యాదృచ్ఛికంగా ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారుల పేర్లు ఒకటే కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సిట్ దర్యాప్తులు రెండు కొనసాగుతున్నాయి. మద్యం స్కాంపై సిట్ ఎప్పుడో ఏర్పాటు చేయగా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దీనికి అధిపతిగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఎస్పీ స్థాయి అధికారులు దాదాపు ఏడుగురిని అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో పలు సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. ఇక ఈ సిట్ దర్యాప్తు అంతిమ లక్ష్యం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అరెస్టే అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తాజాగా ఇసుక అక్రమాలపై దర్యాప్తునకు ప్రభుత్వం మరో సిట్ నియమించింది. దీనికి అధిపతిగా రాయలసీమ జేడీ రాజశేఖర్ ను నియమించింది. ఈయన టీంలో పలువురు డీఎస్పీలు, సీఐలు పనిచేస్తారని శుక్రవారమే ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో దాదాపు రూ.2,566 కోట్ల ఇసుక అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు అక్రమంగా తవ్వకాలు జరిపిన నేతల అరెస్టు చేయడంతోపాటు ఇసుక నుంచి అంతిమంగా ముడుపులు తీసుకున్న నేతలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ స్కాంలోనూ మాజీ సీఎం జగన్ ను దోషిగా నిలబెట్టాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. దీంతో రాజశేఖర్ రెడ్డి కుమారుడి కోసం ఇద్దరు రాజశేఖర్ లు రంగంలోకి దిగారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.