వైసీపీ వర్సెస్ కూటమి: ఇంటింటి ప్రచారం.. !
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరుగనుంది. ఈ వ్యవహారాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి.;
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరుగనుంది. ఈ వ్యవహారాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. రెండు రోజులకిందట జరిగిన కూటమి అగ్రనేతల సమావేశంలో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. కల్తీ నెయ్యిలో కొవ్వు కలిసిందన్న విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలని.. వైసీపీ హయాంలో జరిగిన దారుణాన్ని ప్రజలకువ వివరించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో కరపత్రాలు సహా.. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా నెయ్యి పై ప్రచారం చేయాలని.. కూటమి నేతలు నిర్ణయానికి వచ్చారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రజలకు ఫోన్లు కూడా వస్తున్నాయి. నెయ్యి కల్తీపై మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై మీరు ఎలా స్పందిస్తారు? నెయ్యి కల్తీని మీరు సమర్థిస్తారా? అంటూ.. ముచ్చటగా మూడు ప్రశ్నలతో ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
అనంతరం.. కరపత్రాలు ముద్రించి.. వాటిని ప్రజలకు పంపిణీ చేయనున్నారు. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. కల్తీ నెయ్యి జరిగింది? శ్రీవారి ఆలయ పవిత్రతను ఎలా భగ్నం చేశారు? అనే విషయాలపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయనున్నారు. దీనికి ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకోనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ కూడా సేమ్ టు సేమ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో తమపై అనవసరంగా యాగీ చేస్తున్నారని ఆ పార్టీ చెబుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నాయకులను కూడా బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి కార్యాయల వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను కూడా ప్రజలకు వివరించనున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. ఈ వ్యవహారాలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.