‘ప్రెస్ మీట్‌కైనా పర్మిషన్ ఇవ్వండి’.. పోలీసులకు పవన్ రిక్వెస్ట్

హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్ చేశారు.

Update: 2026-06-02 08:35 GMT

హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పవన్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టాలని పవన్ ముందుగా భావించారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కనీసం ప్రెస్ మీట్ నిర్వహణకు అయినా పర్మిషన్ ఇవ్వాలని జనసేనాని రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందులో భాగంగానే గచ్చిబౌలి వేదికగా ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ పెట్టాలని జనసేన ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి గత రెండు రోజులుగా పర్మిషన్ల కోసం జనసేన నేతలు పోలీసుల చుట్టూ తిరిగారు. అయితే, తెలంగాణ వాదులు, ప్రభుత్వ పెద్దలు కూడా జనసేన సభ నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తదితరులు నవ నిర్మాణ సభ ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ మీడియాలో గళం వినిపించారు. ఈ నేపథ్యంలో అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఆలోచనతో పోలీసులు జనసేన సభకు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ కల్యాణ్ వ్యూహం మార్చారు. ఎలాగైనా తన గొంతు వినిపించాలనే ఆలోచనతో ప్రెస్మీట్ నిర్వహణకు అనుమతి కోరారని అంటున్నారు.

పవన్ కల్యాణ్ ట్వీట్ సంచలనం!

పోలీసులు సభకు అనుమతి నిరాకరించడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విభిన్నంగా స్పందించారు. ‘జూబ్లీహిల్స్‌లోని నా నివాసంలో ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నాను. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య జనసేన ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడతాను. కనీసం ఈ ప్రెస్‌మీట్‌కైనా తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నాను’ అంటూ పవన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. పవన్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రెస్ మీట్ నిర్వహించాలని ఆయన నిర్ణయించుకోవడం, ఆయన నివాసంలోనే ప్రెస్ మీట్ పెడతాననడంతో పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇటీవల కాలంలో తెలంగాణలో జనసేన, డిప్యూటీ పవన్ సీఎం పవన్ చుట్టూ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు, తర్వాత పరిణామాల నేపథ్యంలో కొంత భావోద్వేగం చోటుచేసుకుందని విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. దీనికి కొనసాగింపుగా పవన్ సభ పెడతాననడం ఆసక్తికరంగా మారింది. పవన్ సభ నిర్వహిస్తే ఏం చెబుతారు? అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆయన సభ నిర్వహణకు ఎందుకు సమాయత్తమవుతున్నారనేదే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించి షాకిచ్చారు. అయితే ప్రెస్ మీట్ పెడతానంటూ పవన్ అనుమతి కోరడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దీనికి అనుమతించే విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం 4.30 నిమిషాలకు పవన్ ఏం మాట్లాడతారు? ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.




Tags:    

Similar News