ఆరున విస్తరణ .. ఆ ముగ్గురికి చోటు ఖాయమేనా ?!
తెలంగాణ క్యాబినెట్లో సీఎంతో కలుపుకుని 18 మంది మంత్రులు ఉంటారు. కొండా సురేఖను తొలగించే వరకు సీఎంతో కలుపుకుని 16 మంది ఉండేవారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖాయం అయినట్లేనా ? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా ? ఈ నెల 7 నుండి శాసనసభ సమావేశాల నేపథ్యంలో దానికి ముందే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా ? లేక శాసనసభ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ? మంత్రి కొండా సురేఖ మీద వేటు పడి నేపథ్యంలో తదుపరి మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్నలు.
తెలంగాణ క్యాబినెట్లో సీఎంతో కలుపుకుని 18 మంది మంత్రులు ఉంటారు. కొండా సురేఖను తొలగించే వరకు సీఎంతో కలుపుకుని 16 మంది ఉండేవారు. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండేవి. తాజాగా సురేఖ మీద వేటు నేపథ్యంలో ఆ ఖాళీల సంఖ్య మూడుకు చేరింది. మొదట సీఎంతో కలిపి 12 మందికి మంత్రి పదవులు ఇచ్చారు.
ఆ తరువాత జరిగిన విస్తరణలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిట శ్రీహరిలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ కు మైనారిటీ శాఖా మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీంతో రెండు ఖాళీలు మిగిలిపోయాయి. వీటి కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ మీద వేటుపడింది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు స్థానాలను భర్తీ చేసేందుకు అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఈ విస్తరణలో అవకాశం కల్పించనున్నారని తెలుస్తుంది. ఒక బీసీ; ఒక ఎస్సీ, ఒక ఓసీకి అవకాశం లభించినట్లు అవుతుందని భావిస్తున్నారు.
అయితే లంబాడా, యాదవ సామాజికవర్గాల నుండి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తప్పించకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారా ? స్పీకర్ కు మంత్రి పదవి ఇస్తే ఆయన స్థానం ఎవరికి ఇస్తారు ? పీసీసీ అధ్యక్షుడికి మంత్రి పదవి ఇస్తే ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారు ? అన్న చర్చ తలెత్తుతుంది. ఈ మొత్తం స్థానాలు భర్తీ అయితే ఆశావాహులు ఎలా స్పందిస్తారు ? అన్న అనుమానాలు ఉన్నాయి.