పులివెందుల.. పులులెవరు.. ?
``రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల గెలిస్తే ఏంటి.. వైసీపీకి ప్రాబల్యం ఉన్న కడప జిల్లాను కొట్టాలి కానీ!`` ఇదీ.. తరచుగా టీడీపీలో వినిపిస్తున్న మాట.
``రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల గెలిస్తే ఏంటి.. వైసీపీకి ప్రాబల్యం ఉన్న కడప జిల్లాను కొట్టాలి కానీ!`` ఇదీ.. తరచుగా టీడీపీలో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే కడపను కేంద్రంగా చేసుకుని.. పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పాగా వేయడంతో పాటు.. ఇక్కడి స్థానిక ఎన్నికల్లో పూర్తిస్థాయి ఏకగ్రీవాలకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో మంత్రులు సవిత, బీసీ జనార్దన్రెడ్డి, ఫరూక్ల నేతృత్వంతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పులివెందుల నియోజకవర్గంలో పార్టీకి బలాబలాలను అంచనా వేయడంతోపాటు.. కడప జిల్లాలో టీడీపీ దూకుడును కూడా లెక్కించనుంది. తద్వారా స్థానిక ఎన్నికల్లో పులివెందులను ఒంటిచేత్తో తీసుకురాగల పులల కోసం అన్వేషిస్తోంది. అయితే.. ఇక్కడ డౌట్ రావొచ్చు. ఆల్రెడీ.. బీటెక్ రవి ఉన్నారు కదా.. ఆయన చూసుకుంటారు కదా!.
ఆయన ప్రాధాన్యం ఏమాత్రం తగ్గించకుండా.. ఆయనకు దన్నుగా .. మంత్రి లోకేష్ ఈ ప్రయత్నాలు ము మ్మరం చేశారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధితోపాటు.. ఇటీవల వెలిగొండ ద్వారా కడపలోని 8 మండలాలకు ఇస్తున్న నీరు.. అలానే పట్టిసీమ ద్వారా పులివెందులకు ఇప్పటికే పారుతున్న సాగునీరు వ్యవహారాలను హైలెట్ చేసి.. స్థానికంలో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే.. సరికొత్త వ్యూహాలు వేస్తున్నారు.
ప్రస్తుతం పులివెందులను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగానే మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు.. వైసీపీ అసంతృప్తులు.. బలమైన నాయకులను కూడా చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేదా.. పోటీ ఉంటే.. పులుల తరహా నాయకుల ను కూడా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాలు సాఫీగా సాగుతాయన్నది పార్టీ చెబుతున్న మాట. ప్రస్తుతం వైసీపీకి బలం తగ్గడం.. నియోజకవర్గంలోనూ కదలికలు లేకపోవడం వంటివి తమకు లాభిస్తాయన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది.