'తమ్ముళ్ల' తీరిది..ఆన్లైన్ సర్వేల మాట!
రాష్ట్రవ్యాప్తంగా 135 స్థానాల్లో ఘన విజయం దక్కించుకున్న టిడిపి 2024 ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 135 స్థానాల్లో ఘన విజయం దక్కించుకున్న టిడిపి 2024 ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. మరో రెండు రోజుల్లో కూటమి పాలనకు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ క్రమంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది.. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క తీరుగా ఉందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుటుంబ రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే క్షేత్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు.
ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదు. మంత్రులు కూడా సొంత వ్యవహారాలను చూసుకుంటున్నారు... అనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆన్లైన్ ఛానళ్లు చేస్తున్న సర్వేల్లో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇక, కోస్తా.. నెల్లూరు ప్రాంతాల్లో రాజీధోరణిలో వైసిపి- టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వ్యాపారాలు, వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకుంటూ ఒకరినొకరు సమర్ధించుకుంటున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇసుక, మట్టి, మద్యం వంటి విషయాల్లో అక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి అన్నది సర్వేల్లో స్పష్టమైంది. ఇక రాయలసీమలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఎవరికి వారు పెత్తనం చేయడంతో పాటు అంతా తమకే కావాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే పార్టీ లైనుకు అనుగుణంగా ప్రజలకు చేరువ అయ్యే దిశగా వ్యవహరిస్తున్నారనేది సర్వేల్లో స్పష్టమైంది. మొత్తంగా టిడిపి ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత అయితే ప్రారంభం అయింది అన్నది వాస్తవం.
దీనిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని సర్వేల్లో తేలుతోంది. ఈ వ్యవహారంపై సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారు అనేది చూడాలి. సంతృప్తి -అసంతృప్తి లెక్కలను ఎప్పటికప్పుడు చంద్రబాబు వేసుకుంటున్నప్పటికీ వాస్తవాలను గ్రహించే విషయంలో ఆయన కొంత వెనుక పడుతున్నారా అనేది చర్చకు దారితీస్తోంది. లేకపోతే ఆయనకు సరైన సమాచారం అందడం లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏదేమైనా.. రెండు సంవత్సరాల పాలనలో పైకి ఎలా ఉన్నా.. అంతర్గతంగానే కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం కొనసాగుతున్నాయి.