తండ్రికి గుండెపోటు.. కాబోయే భర్తకు అనారోగ్యం.. స్మృతి మందానాకు ఏంటీ పరిస్థితి
భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్గా గుర్తింపు పొందిన స్మృతి మంధానకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.;
భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్గా గుర్తింపు పొందిన స్మృతి మంధానకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. నెలలుగా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఆమె వివాహం చివరి నిమిషంలో వాయిదా పడడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆదివారం సాయంత్రం స్మృతి – సంగీత దర్శకుడు పలాశ్ ముచ్ఛల్ల వివాహం జరగాల్సి ఉండగా, అనూహ్య పరిణామాలు వాటిల్లాయి.
ఛాతి నొప్పితో ఆసుపత్రి పాలైన స్మృతి తండ్రి
వివాహ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధన్నకు అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో నిలకడగా ఉన్నారని వైద్య బృందం తెలిపింది. అవసరమైన పరీక్షలు జరిపి, ఈ రోజు ఆంజియోగ్రఫీ చేయాలని నిర్ణయించారు.
కాబోయే భర్త పలాశ్ ముచ్ఛల్కి కూడా అనారోగ్యం
స్మృతి తండ్రి ఆరోగ్య సమస్యలతో పెళ్లి మందిరంలో ఆందోళన నెలకొనగా కొద్ది గంటల్లోనే మరో షాక్ తగిలింది. స్మృతి కాబోయే భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్ఛల్ కూడా అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వైరల్ ఫీవర్తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి ప్రమాదకరం కాదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం పలాశ్ను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
*వివాహం వాయిదా… భావోద్వేగంగా స్మృతి నిర్ణయం
తండ్రి పరిస్థితి విషమించడంతో వివాహ తంతులను కొనసాగించేందుకు స్మృతి నిరాకరించింది. తండ్రి పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి జరపకూడదని ఆమె నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ విషయాన్ని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగి ఆనందం నిండిన వేళ ఈ అకస్మిక ఘటన అందరికీ షాక్ కలిగించింది.
అభిమానుల ప్రార్థనలు – కుటుంబం ఆశాభావం
స్మృతి మంధాన కుటుంబం ప్రస్తుతం ఆసుపత్రి పరిసరాల్లోనే ఉంది. శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం కొంత ఊరటనిచ్చినా, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. పలాశ్ ముచ్ఛల్ కూడా విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ ఎప్పుడు పెళ్లి?
వివాహానికి కొత్త తేదీపై కుటుంబం తర్వాత నిర్ణయం తీసుకోనుంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ఈ జంట ఇప్పుడు తండ్రి ఆరోగ్యం మెరుగుపడే వరకు వేచి చూడాల్సి వస్తోంది.
కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని, స్మృతి–పలాశ్ల వివాహం శుభంగా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.