ప్రైవేట్ పార్టుకు క్రికెట్ బాల్ తగిలి పిల్లాడి ప్రాణం పోయింది

అయ్యో అనిపించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. విన్నంతనే ఉలిక్కిపడే ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Update: 2024-05-07 05:19 GMT

అయ్యో అనిపించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. విన్నంతనే ఉలిక్కిపడే ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వేసవి వేళలో ఆటలు ఆడుకునే పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది. క్రికెట్ ఆడుతున్న వేళ.. పదకొండేళ్ల బాలుడి ప్రైవేట్ పార్టుకు క్రికెట్ బాల్ బలంగా తగలటంతో ప్రాణాలు కోల్పోయాడు.

పూణెలోని లోహెగావ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదం షాకింగ్ గా మారింది. లోహెగావ్ కు చెందిన పదకొండేళ్ల శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆటలో భాగంగా శౌర్య బౌలింగ్ చేస్తుండగా.. మరో బాలుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే.. వేగంగా వచ్చిన బంతి బాధిత బాలుడి ప్రైవేట్ పార్టుకు బలంగా తాకింది.

దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో భయపడిపోయిన మిగిలిన పిల్లలు.. ఆ బాలుడ్ని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. క్రికెట్ బాల్ తగిలి బాలుడు కుప్పకూలి పోయినవైనాన్ని చూసిన చుట్టుపక్కల వారు స్పందించి.. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. అయితే.. ప్రైవేట్ పార్టుకు బంతి బలంగా తాకటంతో మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన బాలుడి ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు. వేసవి వేళలో.. పిల్లలు ఆడుకోవటానికి వెళ్లే వేళలో.. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News