ఆర్‌ఎస్‌ఎస్....బీజేపీకి దూరంగానే !

దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన సంస్థగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్ ఉంది. బ్రిటిష్ వారి కాలంలోనే 1925లో ఈ సంస్థ ఏర్పాటు అయింది.;

Update: 2025-12-22 04:30 GMT

దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన సంస్థగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్ ఉంది. బ్రిటిష్ వారి కాలంలోనే 1925లో ఈ సంస్థ ఏర్పాటు అయింది. ఈ ఏడాదికి తొలి శతాబ్దం పూర్తి చేసుకుని రెండవ శతాబ్దం లోకి అడుగుపెట్టింది. గత ఏడాది కాలంగా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంకా దేశంలో చాలా చోట్ల అవి జరుగుతున్నాయి. అయితే తాజాగా మోహన్ భగవత్ ఆర్‌ఎస్‌ఎస్ మీద విమర్శలు తరచూ రావడం మీద ఘాటుగా స్పందించారు. ఆయన మోహన్ భాగవత్ దేశాభివృద్ధికి సమాజాన్ని సంఘటితం చేయడం అత్యవసరమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలోని సైన్స్ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ రాజకీయ నీడ ఆర్‌ఎస్‌ఎస్ మీద లేనే లేదని స్పష్టం చేశారు.

నిజాయతీగా విమర్శలు :

రాజకీయాలకు ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి సంబంధం లేదని ఆయన అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు వెనక ఒక భారీ లక్ష్యం ఉందని చెప్పారు. ఒక సమున్నత ఆశయంతో ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో వందేళ్ళ క్రితం స్థాపించారు అని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి సమాజాన్ని సంఘటితం చేయడం అన్నది ఆర్‌ఎస్‌ఎస్ అసలైన అజెండాగా చెప్పారు. వర్తమాన కాలంలో ఇది అత్యవసరమని అన్నారు. భారతదేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆ దిశగానే ఆర్‌ఎస్‌ఎస్ తన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ని విమర్శించండి, అయితే అందులో వాస్తవ కోణం చూసి మాట్లాడాలని ఆయన కోరుతున్నారు.

ఎవరికీ వ్యతిరేకం కాదు :

ఆర్‌ఎస్‌ఎస్ ఎవరికీ వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు. సమాజంలోని సాధారణ సభ్యులు ప్రముఖ వ్యక్తుల ఆదర్శాలను అనుసరిస్తారని, కాబట్టి అటువంటి ప్రభావవంతమైన వ్యక్తులతో ఒక సంస్థను నిర్మించడం చాలా అవసరమని మోహన్ భాగవత్ అన్నారు. ఆ దిశగా ఉత్తమమైన పౌరులను తయారు చేయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని చెప్పారు. అంతే తప్ప ఆర్‌ఎస్‌ఎస్ఎవరికీ వ్యతిరేకంగానో లేదా ప్రతి చర్యగానో ఏర్పడలేదని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి స్పష్టం చేశారు. ఇక ఘ్ తన వాగ్దానాలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తుందని అది ఏ వ్యక్తిగత లేదా సంస్థాగత ప్రయోజనం కోసం పనిచేయదని ఆయన అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అంటూ :

కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ ని ప్రతీ దానికీ ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తావనతో బీజేపీని విమర్శిస్తోంది. తాజాగా ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కూడా ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తావన వచ్చింది. దీని మీద అయితే గత కొంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్ లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం చీఫ్ గా ఉన్న మోహన్ భగవత్ అయితే దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం తరచూ చేస్తూ వస్తున్నారు.

రాజకీయాలొద్దు :

తమకు దైనందిన రాజకీయాలతో సంబంధం ఏమీ లేదని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత హోదాలో మోహన్ భగవత్ ఇప్పటికి చాలా సార్లు ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు ఎవరిని ఎన్నుకోవాలో ఆ పార్టీ ఇష్టం అన్నారు. అంతే కాదు ఎవరు ప్రధానిగా ఉండాలో బీజేపీ వారే నిర్ణయించుకుంటారు అని ప్రధాని మోడీకి 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన చెప్పాల్సింది చెప్పారు. తాము దేశం కోసం పనిచేస్తున్నామని ఆయన అంటున్నారు. అంతే కాదు దేశంలో హిందూ సమాజం సంఘటితం కోసం పనిచేయడం తల విధానం అని కూడా అంటున్నారు. తమ అజెండాను ఈ విధంగానే ముందుకు తీసుకుని పోతామని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఆర్‌ఎస్‌ఎస్ తన పంధాలో కొత్త పోకడలను అనుసరిస్తోంది అని చెప్పాలి. అయితే ఆర్‌ఎస్‌ఎస్ తాము రాజకీయ నీడ నుంచి ఎంతగా బయటపడాలని చూసినా బీజేపీతో కలసి ముడిపెట్టి విమర్శించేందుకు నేతలు ఏ మేరకు తగ్గుతారు అన్నది చర్చగానే ఉంది. ఎందుకంటే బీజేపీలో అత్యధిక శాతం ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వారే ఉండడం విశేషం. మొత్తానికి రాజకీయ రొంపిలోకి తమను లాగవద్దు అని మోహన్ భగవత్ అంటున్నారు.

Tags:    

Similar News