ఏపీ కొత్త సీఎం ఎవరో రేవంత్ కి తెలిసిపోయిందా ?

తెలంగాణా సీఎం గా ప్రమాణం చేసిన దాదాపు ఆరు నెలలకు ఏపీకి రేవన్ రెడ్డి వచ్చారు.

Update: 2024-05-23 03:50 GMT

తెలంగాణా సీఎం గా ప్రమాణం చేసిన దాదాపు ఆరు నెలలకు ఏపీకి రేవంత్ రెడ్డి వచ్చారు. నిజానికి ఆయన తిరుపతి మొక్కు అన్నది తీర్చుకుంటారు అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఆయన తిరుపతి వస్తారు. అలాగే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వార్ని దర్శించుకుంటారు అని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అలా ఏపీకి వచ్చిన సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అవుతారు అని డేట్ టైమూ కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇన్నాళ్ళకు రేవంత్ తిరుపతి వచ్చారు. అయితే ఈ సందర్భం చూస్తే ఏపీలో సీఎం జగన్ కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కానీ లేరు. ఇద్దరూ విదేశాలలో ఉన్నారు. పైగా ఏపీలో ఎన్నికలు ముగిసి ఆపద్ధర్మ పాలన సాగుతోంది. దాంతో పాటు ఎన్నికల కోడ్ ఉంది. అందువల్ల ఎవరికీ కలవడానికి వీలు లేని వేళ ఇది.

దీంతో రేవంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటనకే పరిమితం చేశారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ మత్రం వైరల్ అవుతున్నాయి. ఆయన ఏపీ ప్రభుత్వంతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తాను అని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలూ బాగుండాలని కోరుకున్నారు.

అంతే కాదు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తాను మరోసారి వచ్చి ఏపీ సీఎం ని కలుస్తాను రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి గురించి చర్చిస్తాను అని చెప్పారు. జూన్ 4న ఏపీకి కొత్త సీఎం ఎవరో తేలిపోతుంది. మరి రేవంత్ మదిలో ఎవరు ఉండవచ్చు అంటే సహజంగానే ఏపీ కాంగ్రెస్ నాయకుల మాదిరిగానే ఆయన కూడా టీడీపీ వస్తుందనే భావించవచ్చు అని అంటున్నారు.

Read more!

కాంగ్రెస్ ఎదుగుదల కోసం అయినా వైసీపీ ఓటమి పాలు కావాలన్నది ఆ పార్టీ నేతల మాట. వైసీపీ ఓడితేనే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వెనక్కి వచ్చి ఏపీలో ఆ పార్టీ బలోపేతం అవుతుంది. 2029 ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని ఏపీలో అడుగులు వేయడానికి 2024 ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావించడంలో అర్ధం ఉంది.

అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కూటమి వస్తుందనే భావించవచ్చు అని అంటున్నారు. ఆయన తిరుపతి టూర్ పెట్టుకున్న నేపధ్యం చూసినా అదే అనిపిస్తోంది అంటున్నారు. ఆయన గతంలో వచ్చి ఉంటే ఏపీ సీఎం ని కలవకుండా వెళ్తే ఒక చర్చ కలిస్తే మరో చర్చా వచ్చేది. కానీ ఇపుడు సేఫ్ గానే ఆయన మంచి టైం లోనే ఏపీకి వచ్చారు అంటే ఆయన మదిలో ఏముందో అర్ధం అవుతోంది కదా అని అంటున్నారు. అంతే కాదు

ఏపీ కొత్త సీఎం తో తప్పకుండా తాను భేటీ అవుతాను అని ఏపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు జగన్ సైతం రేవంత్ రెడ్డి విషయంలో దూరం పెట్టినట్లుగానే ఉంటున్నారు.

ఆయన చంద్రబాబు మనిషి అని ఈ రోజుకీ భావిస్తున్నారు. దాని మీద ఒక ఇంటర్వ్యూలో జగన్ వ్యాఖ్యానిస్తే దాన్ని రేవంత్ రెడ్డి కూడా తిప్పికొట్టారు. అలా ఆరు నెలలుగా ఇరుగు పొరుగు సీఎంల మధ్య కనీసంగా కూడా ఫోన్ కాల్స్ లేవు అని అంటున్నారు. దాంతో మరోసారి జగన్ వస్తే కనుక రేవంత్ రెడ్డి తప్పక భేటీ అవుతాను అని ఉండరని చెబుతున్నారు. సో బాబు సీఎం అవుతారు అన్నది ఆయనకు ఉన్న సమాచారం కాబట్టే అంత ఓపెన్ గా చెప్పారని విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News