పీఓకే ప్రజలు అంతా భారత్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు
ఆ సమయంలో కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉంది. అయితే పాక్ దండెత్తి వచ్చినపుడు కాశ్మీర్ రాజు భారత్ ని శరణు కోరారు.;

పీవోకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. అది ఈ రోజున ఆక్రమించబడలేదు. భారత్ పాక్ రెండుగా విడిపోయిన రెండు నెలలకే కొంత కాశ్మీర్ భాగం పాక్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ కి స్వాతంత్రం వచ్చింది. ఆ తరువాత 1947 ఆగస్టు 15కి భారత్ కి స్వాతంత్రం వచ్చింది. ఇది జరిగిన తర్వాత సరిగ్గా రెండు నెలల వ్యవధిలో అంటే అక్టోబర్ లో కాశ్మీర్ మీద పాకిస్తాన్ దాడి చేసి యుద్ధాన్ని ప్రకటించింది.
ఆ సమయంలో కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉంది. అయితే పాక్ దండెత్తి వచ్చినపుడు కాశ్మీర్ రాజు భారత్ ని శరణు కోరారు. అంతే కాదు భారత్ లో తమ సంస్థానాన్ని విలీనం చేస్తామని ప్రకటించారు. అలా భారత్ లో కాశ్మీర్ విలీనం అన్నది ఒక న్యాయసమ్మతమైన ఒప్పందం మేరకు జరిగింది.
కానీ కాశ్మీర్ ని తమలో కలుపుకుని పోవాలని పాకిస్థాన్ దుర్బుద్ధితో వ్యవహరించి భారత్ లో యుద్ధం చేసింది. ఆ సమయంలోనే మూడవ వంతు కాశ్మీర్ భూభాగం పాక్ పరం అయింది. దానికి వారు తాము జయించిన ప్రాంతంగా చెప్పుకుంటారు. భారత్ వైపు నుంచి చూస్తే మాత్రం పాక్ ఆక్రమించిన ప్రాంతంగానే చూస్తారు.
ఇప్పటికి ఏడున్నర పదుల కాలం గడచింది కానీ పాక్ చెరలో ఉన్న పీఓకేని భారత్ వెనక్కి తిరిగి తెచ్చుకోలేకపోతోంది. పాక్ తో మూడు యుద్ధాలు జరిగినా అందులో అన్నీ భారత్ విజయం సాధించినా కూడా పీఓకే మాత్రం పాక్ వద్దనే ఉండిపోయింది అంటే అంతా అదే ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అయితే దీని మీద చాలాసార్లు ప్రకటనలు ఇచ్చారు. తాజాగా ఆయన సీఐఐ బిజినెస్ సమ్మిట్ లో మాట్లాడుతూ అతి తొందరలోనే పీఓకే భారత్ లో విలీనం అవుతుందని ధీమాగా చెప్పారు. పీఓకేలో ఉన్న ప్రజలు కూడా భారత్ లో భాగమే అని ఆయన కొత్త మాట చెప్పారు.
త్వరలో వారంతా భారత్ లో కలుస్తారని ఆశాభావంగా చెప్పారు పాక్ ఆక్రమిత ప్రజలు భారత్ కి సొంత వారే అని మరో మాట అన్నారు. వారంతా భారత్ కుటుంబ సభ్యులు సోదరులు అని రాజ్ నాధ్ సింగ్ గట్టిగానే చెప్పారు ఒకింత భావోద్వేగాన్ని కలిగించే విధంగా చెప్పారు.
పీఓకే ప్రజలు అంతా భారత్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారని వారు ఆ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని కూడా ఆయన అన్నారు పీఓకే భారత్ సొంతం. ఇది ఎవరూ విడదీయలేరు, భారత్ లో మేము మళ్ళీ భాగమవుతున్నామని పీఓకే వాసులు చెప్పే రోజు అతి సమీపంలో ఉందని అన్నారు.
ఈ విధంగా రాజ్ నాథ్ సింగ్ భారత్ లో పీఓకే కలుస్తుందని చెప్పడం ద్వారా సంచలనం రేపారు. అది ఎపుడు జరుగుతుంది అన్నది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే పాక్ తాను ఆక్రమించిన పీఓకేని తిరిగి భారత్ కి స్వయంగా అప్పగించదు. భారత్ దానిని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. మరి ఆ యుద్ధం ఎపుడో ఒకపుడు వస్తుందా లేదా తొందరలో వస్తుందా అన్నదే చర్చగా ఉంది.
ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో పాక్ ఆశలకు ఇపుడు చైనా ఆశలు తోడు అయ్యాయి. చైనా అక్కడ ఎకనామిక్ కారిడార్ ని నిర్మిస్తూ కొంత ప్రాంతాన్ని తన నిర్మాణాలకు వాడుకుంటోంది అని అంటున్నారు. దాంతో పాక్ కి చైనా సాయం కూడా చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పీఓకేని వెనక్కి తేవాలన్న గట్టి పట్టుదలతో ఉంది అని అంటున్నారు మరి ఆ రోజు ఎపుడు అన్నది అంతా వేచి చూడాల్సిందే.