కరోనా లాంటి సంక్షోభం...భారత్ కి పెను సవాళ్ళేనా ?

పశ్చిమాసియాలో యుద్ధం గత ఇరవై రోజులకు పైగా పెద్ద ఎత్తున సాగుతోంది. అదే సమయంలో దేశంలో పార్లమెంట్ సాగుతోంది.;

Update: 2026-03-23 17:24 GMT

పశ్చిమాసియాలో యుద్ధం గత ఇరవై రోజులకు పైగా పెద్ద ఎత్తున సాగుతోంది. అదే సమయంలో దేశంలో పార్లమెంట్ సాగుతోంది. ఈ యుద్ధం ప్రభావం దేశం మీద పెద్ద ఎత్తున ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు అంతర్జాతీయ పరిణామల నేపధ్యంలో భారత్ స్టాండ్ ఏమిటి అన్నది కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీటికి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ జవాబు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు.

భారత్ కి సవాళ్ళు అంటూ :

ఇక లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంలో చెప్పినది ఏంటంటే పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని. అంతే కాదు ఈ యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉందని కూడా మోడీ చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం రూపంలో భారత్‌కు ఎన్నో పెను సవాళ్లు తీసుకొచ్చి ముందు పెట్టిందని కూడా ప్రధాని చెప్పారు. గల్ఫ్‌లో ఒక మినీ భారతం ఉందని కూడా ప్రధాని ప్రకటన ద్వారా తేటతెల్లమవుతోంది ఏకంగా కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలను ఆశ్రయించి ఉన్నారని చెప్పారు. దాంతో అక్కడ భారీ సంఖ్యలో ఉన్న భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మోడీ లోక్ సభకు తెలిపారు.

ఆర్థిక మాంద్యం ముప్పు :

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని మోడీ చెప్పడం విశేషం. అయితే ఆ ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై పడకుండా చూస్తున్నామని అన్నారు. అదే సమయంలో ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అంతే కాదు కరోనా సమయంలోనూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని ఆయన ప్రస్తావించడం విశేషం. దీంతోనే సగటు జనాలలో ఒక కలవరం రేగుతోంది. మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు అంటే ఏమి జరుగుతుంది అన్నది అంతా తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. ఆనాటి చేదు సందర్భాలను గుర్తుకు తెచ్చుకుని కంగారు అయితే పడుతున్నారు.

యుద్ధం ఆపడానికి కృషి :

అయితే మోడీ అయితే లోక్ సభలో చేసిన ప్రకటనలో వాస్తవ పరిస్థితులను వివరించడమే కాకుండా కేంద్రం అప్రమత్తం గా ఉందని చెప్పారు. అంతే సమయంలో ఒకింత అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఇక ఖరీఫ్ సీజన్‌లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తామని ప్రధాని చెప్పారు. అంతే కాకుండా పవర్‌ ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన అన్నారు. తాను ప్రతిరోజు పశ్చిమాసియా దేశాధ్యక్షులతో మాట్లాడుతున్నానని, యుద్ధాన్ని ఆపడానికి తన వంతుగా చేయాల్సినంతగా కృషి చేస్తున్నానని నరేంద్ర మోదీ చెప్పడం విశేషం.

ఊరాటను ఇచ్చే విషయం :

ఇదే సందర్భంలో దేశానికి కాస్తా ఊరటను ఇచ్చే ప్రకటనను మోడీ చేశారు. ప్రజలకు పెట్రోల్‌ గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు. అరవై శాతం ఎల్పీజీని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. అలాగే 41 దేశాల నుంచి ఇంధనం కొంటున్నామని చెప్పారు. ఇక 53 లక్షల మెట్రిక్‌ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని ధీమాను ఇచ్చే ప్రకటన చేశారు. అలాగే రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల డీజిల్‌ ఆదా అయిందని గుర్తు చేశారు ఏది ఏమైనా జాగ్రత్తగా ప్రస్తుతానికి కేంద్రం చర్యలతో ఉన్నా యుద్ధం కనుక ముగింపునకు రాకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవన్నట్లుగా కూడా మోడీ చేసిన ప్రకటనలో సంకేతాలు కనిపిస్తున్నాయని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

తరలింపు ముమ్మరం :

అదే సమయంలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న భారతీయుల కోసం హెల్ప్‌లైన్ తో పాటు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే మూడు లక్షల 75 వేలమందిని సురక్షితంగా భారత్‌కు తరలించామని అన్నారు. అలాగే ఇరాన్‌ నుంచి వేయి మంది దాకా తరలించామని చెప్పారు.

Tags:    

Similar News