ఇక‌.... డైలీనా?: మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు!

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. ఇటీవ‌ల మూడు రోజుల కింద‌ట పెట్రోలు, డీజిల్‌పై 3.4 రూపాయ‌ల చొప్పున పెంచిన విష‌యం తెలిసిందే.

Update: 2026-05-19 10:32 GMT

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. ఇటీవ‌ల మూడు రోజుల కింద‌ట పెట్రోలు, డీజిల్‌పై 3.4 రూపాయ‌ల చొప్పున పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో దేశ‌వ్యాప్తంగా కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు కూడా దిగారు. ఇక‌, నిత్యావ‌స‌ర వ‌స్తువుల నుంచి అన్ని వినియోగ వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. ఈ వ్య‌వ‌హారంపై ఒక‌వైపు దేశంలో చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి ధ‌ర‌లు పెరిగాయి.

లీట‌రు పెట్రోలు, డీజిల్‌పై 90 పైస‌లు చొప్పున పెంచుతూ.. చ‌మురు కంపెనీలు నిర్ణ‌యించారు. మంగ‌ళ వారం ఉద‌యం 6 గంట‌ల నుంచే ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తున్నాయి. దీంతో ధ‌ర‌లు మ‌రింత పెరిగిన ట్టు అయింది. ఏపీలో లీట‌రు పెట్రోలు 114 రూపాయ‌ల‌కు చేరిపోయింది. ఇక‌, డీజిల్ 101 రూపాయ‌ల‌కు చేరింది. ఫ‌లితంగా ఈ ప్ర‌భావం నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

డైలీ పెంచుతారా?

ప్ర‌స్తుతం పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇక నుంచి ప్ర‌తి రోజూ పెంచుతారా? అనే డౌట్ వ‌స్తోంది. అయితే.. ఆ అవ‌కాశం మెండుగానే ఉంద‌ని చ‌మురు కంపెనీలు కూడా చెబుతున్నాయి. ప్ర‌స్తుతం త‌మ‌కు రోజుకు 500 కోట్ల రూపాయ‌ల మేరకు న‌ష్టం వ‌స్తోంద‌ని అంటున్నాయి. మ‌రోవైపు.. కేంద్ర ప్ర‌భుత్వం కూడా.. ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసిన విష‌యం తెలిసిందే. అయినప్ప‌టికీ.. కంపెనీల‌పై భారం ప‌డుతోంది. దీంతో సుమారు.. 125 రూపాయ‌ల వ‌ర‌కు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెరిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

ఎందుకు?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. రోజుకో తీరుగా మారుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు యుద్ధ విరామం ప్ర‌క‌టించామ‌ని చెబుతున్న అమెరికా అధ్య‌క్షుడు.. ఇప్పుడు ఏకంగా అణు యుద్ధం జ‌రిగినా ఆశ్చ‌ర్యం లేద‌న్న సంకేతాలు ఇస్తున్నారు. మ‌రోవైపు ఇరాన్ కూడా.. పౌరుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ఈ ప‌రిణామాల‌తో అన్ని దేశాలు కూడా.. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న చందంగా.. ప్ర‌స్తుత స‌మ‌యంలోనే ఇంధ‌నాన్ని విరివిగా(యుద్ధ విరామం) కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ధ‌ర‌లు ఆకాశాన్ని చేరుతున్నాయి.

Tags:    

Similar News