పవన్ సొంత సర్వే.. జనసేన ఎమ్మెల్యేలపై సంచలన సమాచారం?
సర్వేలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వస్తారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆయన దారిలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తున్నారు.;

సర్వేలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వస్తారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆయన దారిలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పుడప్పుడు సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ విధంగానే తన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకు మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు సీఎం చంద్రబాబు. అయితే దీని నుంచి స్ఫూర్తి పొందారో? లేక తమ ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉందని తెలుసుకోవాలని భావించారో కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓ సర్వే జరిపించారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం జనసేనకు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఓ సర్వే సంస్థ తాజాగా జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల్లో ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు తేలిందని సమాచారం. దీనిపై నివేదిక సిద్ధం చేసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అందజేశారని, తమ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకుని పవన్ షాక్ తిన్నారని అంటున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి జనసేన తిరుగులేని విజయం సాధించింది. పోటీ చేసిన అన్నిస్థానాల్లో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ అంటూ ఇప్పటికీ గొప్పగా చాటుకుంటుంది. అయితే ఎన్నికలు జరిగిన ఏడాదికి జరిపిన సర్వేలో పూర్తి విరుద్ధమైన ఫలితాలు రావడం చూసి డిప్యూటీ సీఎం పవన్ కి దిమ్మదిరిగిపోయిందని అంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని సదరు సర్వే టీం నివేదించినట్లు చెబుతున్నారు.
బంధుప్రీతి, అవినీతి, లిక్కర్, శాండ్ మాఫియాలకు నాయకత్వం వహించడంపై ఎమ్మెల్యేలు విమర్శలు ఎదుర్కుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన డిప్యూటీ సీఎం పవన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వచ్చేనెలలో ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా విజయోత్సవం నిర్వహించాలని కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయాలని జనసేనాని పవన్ పార్టీ యంత్రాంగానికి సూచించారని చెబుతున్నారు. దీంతో తమ అధినేతకు అందిన రిపోర్టులో ఏముందనే సస్పెన్స్ తో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.