పుష్కర ఏర్పాట్లు అదరాలి: పవన్ కల్యాణ్
వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్.. అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయాన్నే ఆయన.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద జరుగుతున్న పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు.
పుష్కరాల ఏర్పాట్లు, పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పనపై వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి నది పవిత్రతను కాపాడుతూ, కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కల్యాణ్ బోటులో పర్యటించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను.. ప్రాజెక్టు పరిస్థితిని ఆయనకు వివరిం చారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను కూడా ఆయన సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అఖండ గోదావరి ప్రాజెక్టు.. ద్వారా రాష్ట్ర పర్యాటక ముఖ చిత్రం సమగ్రంగా మారిపోతుందని తెలిపారు. ఉపాధి, ఉద్యోగ కల్పనతోపాటు.. దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువతను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు.