ఇదీ.. మా ప్రభుత్వ 'భక్తి' : పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ``ఇదీ.. మా ప్రభుత్వ భక్తి`` అంటూ.. రాష్ట్రంలోని ఆలయాల పరిరక్షణకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.;
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ``ఇదీ.. మా ప్రభుత్వ భక్తి`` అంటూ.. రాష్ట్రంలోని ఆలయాల పరిరక్షణకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. రాష్ట్రంలో గత పాలకులు సనాతన ధర్మాన్ని విస్మరించారని.. ఫలితంగా ఆలయాల్లో దొంగతనాలు, ఇతరత్రా కార్యకలాపాలు జరిగాయన్నారు. కాగా.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. చేపట్టిన చర్యలు ఆధ్యాత్మికాన్ని రెట్టింపు చేస్తున్నాయని తెలిపారు.
ముఖ్యంగా ఆలయాల పరిరక్షణకు, భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమి అని అభివర్ణించారు. గతంలో ఆలయాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కానీ.. సీఎం చం ద్రబాబు చొరవతో రాష్ట్రంలో తొలిసారి `మహా శివరాత్రి`ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా 41 శివాలయాలలో పండుగ వాతావరణంలో మహా శివరాత్రి వేడుకలను నిర్వహించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులకు అన్ని సౌకర్యాలుకల్పించినట్టు తెలిపారు.
ఇక, శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణాన్ని ఇటీవలే పూర్తి చేసి భక్తులకు అంకితం ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. నరసరావుపేటలోని కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో కూడా సిమెంటు రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. అలాగే.. రాష్ట్రంలోని చిన్న, పెద్ద ఆలయాలన్నింటికీ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామన్నారు. ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.