సీఎంల వ్యక్తిగత జీవితాలపై దేశవ్యాప్తంగా చర్చ.. ఒమర్ తర్వాత విజయ్ వంతా?

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన సతీమణి పాయల్ అబ్దుల్లా విడాకులు తీసుకున్నారు.

Update: 2026-07-31 13:36 GMT

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన సతీమణి పాయల్ అబ్దుల్లా విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేయడంతో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒమర్ అబ్దుల్లా విడాకులు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. సుదీర్ఘకాలంగా ఒమర్ అబ్దుల్లా దంపతులు వేరువేరుగా ఉంటున్నారు. ఇరువర్గాల అంగీకారం, పెండింగ్ వివాదాల పరిష్కారాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.

1994 సెప్టెంబర్ 1న ఒమర్ అబ్దుల్లా, పాయల్ నాథ్‌ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జహీర్, జమీర్ జన్మించారు. రాజకీయ జీవితం, కుటుంబ బాధ్యతల నడుమ కొంతకాలం పాటు సాగిన వీరి దాంపత్య జీవితం, క్రమంగా వచ్చిన మనస్పర్థల కారణంగా ఒడిదుడుకులను ఎదుర్కొందని చెబుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, ఇతర కారణాలరీత్యా ఒమర్ అబ్దుల్లా, పాయల్ దంపతులు 2011 నుంచి పూర్తిగా వేర్వేరుగా నివసిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 17 ఏళ్లుగా ఇద్దరూ ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తూ వచ్చారని చెబుతున్నారు. ఒకరికొకరు దూరంగా ఉంటున్నప్పటికీ, చట్టపరమైన వివాహ బంధం మాత్రం అలాగే కొనసాగింది. ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న వివాదాలకు శాశ్వత ముగింపు పలకాలని భావించిన వారు, చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు.

తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ 2024లో ఈ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు, అప్పటివరకు తమ మధ్య పెండింగ్‌లో ఉన్న పలు అంశాలు, ఆర్థికపరమైన వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు న్యాయస్థానానికి నివేదించారు. ఇరువైపుల వాదనలను, ఒప్పందాలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒమర్ అబ్దుల్లాకు, వ్యక్తిగత జీవితంలో దశాబ్దాలుగా నలుగుతున్న ఈ అంశానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఒక స్పష్టత లభించినట్లయింది. రాజకీయ రంగంలో ఎన్నో సవాళ్లను, ఒడుదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఒమర్ అబ్దుల్లా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఇలా చట్టబద్ధమైన ముగింపును అందుకున్నారని అంటున్నారు.

హాట్ టాపిక్ గా తమిళనాడు సీఎం కేసు

ఇక దేశంలో భార్యతో వివాదం కొనసాగుతున్న మరో నేతగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పేరు హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ భార్య సంగీత కూడా విడాకులు కోరుతూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని చెబుతున్నారు. తమిళనాడు ఎన్నికల సమయంలో ఈ వివాదం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. కానీ, విజయ్ ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి తమిళనాడు ముఖ్యమంత్రిని చేశారు. దీంతో రాజకీయాలకు వ్యక్తిగత కుటుంబ జీవనానికి సంబంధం లేదని ప్రజలు తీర్పునిచ్చినట్లైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News