అమెరికాలో కొత్త ఉద్యమం ‘నో కింగ్స్’.. అసలు ఏంటిది? జనాలు ఎందుకు రోడ్డెక్కుతున్నారు?

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన వలసదారుల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కారు.;

Update: 2025-06-16 07:30 GMT

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన వలసదారుల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. ‘నో కింగ్స్‌’ (రాజులు వద్దు) అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వలసదారుల హక్కులను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ అమెరికా పట్టణాలన్నింటిలోనూ ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఈ నిరసనలు శనివారం ఉదయం ప్రారంభమై, డౌన్‌టౌన్‌ ప్రాంతాలు, ప్లాజాలు, పార్కులను జనసంద్రంగా మార్చాయి. చిన్న పట్టణాల నుండి భారీ నగరాల వరకు ఇదే దృశ్యం కనిపించింది. వాషింగ్టన్‌లో సైనిక పరేడ్‌ జరుగుతుండగా మరోవైపు నిరసనలు హోరెత్తాయి.

-నో కింగ్స్ ఉద్యమానికి కారణమేంటి?

లాస్‌ ఏంజెలెస్‌లోని వలస సేవలు, సుంకాల విభాగం (ఐస్‌) అధికారులు వలసదారులను అరెస్ట్‌ చేయాలని చేసిన ప్రయత్నాలే ఈ ఉద్యమానికి నాంది పలికాయి. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఇది విస్తరించింది. సియాటిల్‌లో 70,000 మంది, అట్లాంటాలో 5,000 మందికి పైగా, న్యూయార్క్‌, డెన్వర్‌, షికాగో, ఆస్టిన్‌, లాస్‌ఏంజెలెస్‌ నగరాల్లో వేలాది మంది ప్రజలు ఈ నిరసనలలో పాల్గొన్నారు.

వాషింగ్టన్‌లోని లోగాన్‌ సర్కిల్‌లో 200 మందికి పైగా నిరసనకారులు 'ట్రంప్‌ వైదొలగాలి' అంటూ నినాదాలు చేశారు. ట్రంప్‌ను కిరీటం ధరించి బంగారు కమోడ్‌పై కూర్చున్న భారీ పప్పెట్‌ను ఊరేగించారు. కొంతమంది అమెరికా జెండాలను పట్టుకోగా, మరికొంతమంది మెక్సికో జెండాలను ప్రదర్శించి వలసదారులకు మద్దతు తెలిపారు.

కొందరు గవర్నర్లు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోర్టులాండ్‌లో పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించగా, సాల్ట్‌లేక్‌ సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు తీవ్రంగా గాయపడగా, ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వర్జీనియాలో ఓ యువకుడు వాహనంతో ర్యాలీపై దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది.

ఈ ఆందోళనల నడుమే వాషింగ్టన్‌లో సైనిక పరేడ్‌ ఘనంగా జరిగింది. అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా భారీ కవాతు నిర్వహించబడింది. అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ఈ పరేడ్‌కు హాజరై వందనం స్వీకరించారు. అయితే ఈ పరేడ్‌పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ ఖర్చుతో సైనిక పరేడ్‌ నిర్వహించడం సరికాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ డబ్బును సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలన్నది వారి అభిప్రాయం.

ఈ విధంగా అమెరికాలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా, వలసదారుల హక్కుల పరిరక్షణకు లక్షలాది మంది ప్రజలు గళమెత్తారు. ఇది ట్రంప్‌ పరిపాలనకు ఎదురుగా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచింది.

Tags:    

Similar News