వైసీపీ మాజీ ఎంపీకి దోమలబెడద.. కోర్టులో పిటిషన్!
ఈ క్రమంలో మూడో రోజైన శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తుళ్లూరు సీఐ.. సురేష్ ను విచారించారు. ఈ క్రమంలో శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు;

ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజైన శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తుళ్లూరు సీఐ.. సురేష్ ను విచారించారు. ఈ క్రమంలో శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
మరోపక్క కృష్ణపై హత్యాయత్నం కేసులో నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం గుంటూరు రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్ ఛార్జి న్యాయమూర్తి వీఏఎల్ సత్యవతి వాదనలు విన్నారు. ఈ క్రమంలో తీర్పును జూన్ 2కు వాయిదా వేశారు. సురేష్ భార్య దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైనా అదే రోజు తీర్పు వెలువరిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో దోమలు కుడుతున్నాయని, ఫ్యాన్ లేక ఇబ్బందులు పడుతున్నానని మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా లాకప్ లో ఫ్యాన్, దోమల మందు వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు.
అయితే... లాకప్ రూమ్ లో కరెంట్ బల్బులు, ఫ్యాన్లు, పొగవచ్చే దోమల చక్రాలు వినియోగించడానికి నిబంధనలు అనుమతించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తుళ్లూరు సీఐ. దీంతో... లాకప్ బయట నుంచి గాలి వచ్చేలా టేబుల్ ఫ్యాన్ కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది!
ఇక విచారణ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు నందిగం సురేష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు చెబుతున్నారు! ఈ క్రమంలో.. కృష్ణపై దాడికి సంబంధించి పదే పదే ప్రశ్నలు అడిగినా కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తులేదు అని చెప్పగా.. మరికొన్ని ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానలు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో కస్టడీ గడువు ముగియడంతో శనివారం ఉదయం ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.