పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. సమస్యే లేని ఆ కుటుంబంలో ఎందుకు ఇంత దారుణం?
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలను తీసుకుని ఒక తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాలను కలచివేస్తోంది.;
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలను తీసుకుని ఒక తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాలను కలచివేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేవు, భార్యాభర్తల మధ్య గొడవలు అంతకంటే లేవు.. మరి అన్నీ ఉన్న ఆ కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు తీసుకోవడానికి దారితీసిన ఆ 'అజ్ఞాత' కారణం ఏమిటి? చర్లపల్లి-ఘటకేసర్ మధ్య జరిగిన ఈ విషాదకర ఘటన ఇప్పుడు పోలీసులకు పెను సవాలుగా మారింది. ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు నిజాలను వెలికితీసే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.
పుట్టినరోజు నాటి ఘోర విషాదం:
జనవరి నెల ఆ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే జనవరి 28న విజయరెడ్డి, సురేందర్ రెడ్డి దంపతుల పెళ్లిరోజు కాగా, సరిగ్గా మూడు రోజుల తర్వాత అంటే జనవరి 31న సురేందర్ రెడ్డి పుట్టినరోజు. సంతోషంగా గడపాల్సిన ఆ రోజే విజయరెడ్డి తన బిడ్డలు చేతనరెడ్డి, విశాల్ రెడ్డిలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని తేలింది. విజయరెడ్డి ఆ రాత్రి కారులో హాస్టల్స్కు వెళ్లి పిల్లలను తీసుకువచ్చి, రాత్రి 11:30 గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్లో కారు నిలిపి, అక్కడే పార్కింగ్ స్లిప్పై తన చివరి లేఖ రాశారు. ఆఖరిగా తన తమ్ముడికి ఫోన్ కాల్ చేసిన విజయరెడ్డి, ఆ తర్వాత బిడ్డలతో కలిసి పట్టాలపై తనువు చాలించారు.
సీసీటీవీ పుటేజీలే కీలకం:
ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు జీఆర్పీ డీఎస్పీ జావిద్ నేతృత్వంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ నివాసం నుండి ఘటకేసర్, పటాన్చెరు హాస్టల్స్ వరకు ఆమె ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ పుటేజీలను అధికారులు విశ్లేషిస్తున్నారు. మార్గమధ్యంలో ఆమె ఎక్కడైనా ఆగారా? ఎవరితోనైనా మాట్లాడారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. దుబాయ్ నుండి వచ్చిన ఆమె భర్త సురేందర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు. "తమ పిల్లలను తల్లి ఎంతో ప్రేమగా చూసుకునేదని, ఎటువంటి సమస్యలు లేని తన కుటుంబంలో ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని" సురేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఏదో బలమైన కారణం లేదా మానసిక ఒత్తిడి ఉంటే తప్ప ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోరని పోలీసులు భావిస్తున్నారు.
ఒక నిండు ప్రాణం పోవడమే బాధాకరం అయితే, ఏ పాపం తెలియని ఇద్దరు పిల్లలు బలవ్వడం మరింత కలచివేసే అంశం. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కనిపించని మానసిక ఒత్తిళ్లు మనిషిని ఎంతటి దారుణానికైనా పురికొల్పుతున్నాయి. ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుందాం.