ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. కుమారుడి రిక్వస్ట్ ఇదే!
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.;
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఓ రిక్వస్ట్ చేశారు.
అవును... ముద్రగడ పద్మనాభం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కాకినాడలోని ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో భాగంగా.. హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని భావించారని అంటున్నారు.
అయితే శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయనను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు స్పందించారు. ఇందులో భాగంగా... ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఇదే సమయంలో... మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.