మా అమ్మాయి ప్లాన్ మీద ప్లాన్ వేస్తోంది.. మాకు సంబంధం లేదు: కొండా మురళిl
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యవహారంపై ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యవహారంపై ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె ప్లాన్ పై ప్లాన్ వేస్తోందని.. అయితే, అవేంటనేది తమకు తెలియదని పేర్కొన్నారు. అంతేకాదు.. వాటితో తమకు సంబంధం లేదని చెప్పారు. ప్లాన్ ఏ ప్రకారం ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేసి ఉండొచ్చని తెలిపారు. అయితే.. ప్లాన్-బీ ప్రకారం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని చెప్పారు. ఈ వ్యవహారంతో తనకు, తన సతీమణి, మంత్రి సురేఖకు ఎలాంటి సంబంధం లేదని మురళి చెప్పారు.
తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని మురళి స్పష్టం చేశారు. అయితే.. తాజా వివాదం నేపథ్యంలో క్రమ శిక్షణ సంఘం ఎలాంటి చర్యలను సిఫారసు చేసిందో మీడియాలోనే చూశానని.. వాటిని బహిరంగ పరచలేదని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకుంటా రు?.. పెద్దలు ఎలా స్పందిస్తారు? అనే విషయాలు తెలిసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద కుటుంబ మని మురళి చెప్పారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీల పట్ల తమకు ఎంతో విధేయత ఉందని చెప్పారు. వారిపై తమకు విశ్వాసం కూడా ఉందని వ్యాఖ్యానించారు.
తాజా పరిణామాలతో సురేఖ మనస్తాపానికి గురైన మాట వాస్తవమేనని మురళి చెప్పారు. అయితే.. తమ కుమార్తె చిన్న పిల్ల కాదని.. ఆమె ఆలోచనలు ఆమెకు ఉంటాయని తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని సురేఖ కూడా చెప్పారని.. క్రమ శిక్షణ సంఘం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో చూడాలని చెప్పారు. పార్టీలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే.. ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మురళి వ్యాఖ్యానించడం గమనార్హం. తాము పార్టీలు మారే పరిస్థితి లేదని.. కాంగ్రెస్లోనే ఉంటామని మరోసారి తెలిపారు.
కాగా.. బుధవారం మధ్యాహ్నం.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొండా మురళి.. అదేవిధంగా ఇటీవల కాలంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సురేఖ కుమార్తె వ్యవహారం చర్చకు వచ్చిందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే.. మురళి మాత్రం దీనిని తోసిపుచ్చారు. అసలు ఈ విషయాలు చర్చకు రాలేదని చెప్పారు. సురేఖ మంత్రి తన విధులు తాను నిర్వహిస్తున్నారని, మంగళవారం, బుధవారం శాఖాపరమైన విధులకు హాజరయ్యారని చెప్పారు.