పెరిగిన విమాన ఇంధన ధరలు.. గతం కంటే డబుల్.. టికెట్ రేట్లు పెరుగుతాయా?

పశ్చిమాసియా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇప్పటికే రూపాయి విలువ పతనం కావడంతో సతమతమవుతుంటే, ఇప్పుడు విమాన ఇంధనానికి రెక్కలు రావడం సామాన్య, మధ్య తరగతి విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.;

Update: 2026-04-01 06:20 GMT

పశ్చిమాసియా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇప్పటికే రూపాయి విలువ పతనం కావడంతో సతమతమవుతుంటే, ఇప్పుడు విమాన ఇంధనానికి రెక్కలు రావడం సామాన్య, మధ్య తరగతి విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జెట్ ఫ్యూయల్ ధర ఏకంగా రూ. 2 లక్షల మార్కును దాటడం విమానయాన చరిత్రలోనే ఇదే తొలిసారి. గతంలో రూ. 96,638 ఉన్న కిలో లీటర్ ధర, ఇప్పుడు రూ. 2,07,341 కి చేరడం అంటే అది ముమ్మాటికీ విమానయాన రంగానికి ఒక పెద్ద 'షాక్' అని చెప్పాలి.

జెట్ ఫ్యూయల్ రికార్డు ధర

విమాన ఇంధన ధరలు గతంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. గత నెలతో పోలిస్తే అంతర్జాతీయ విమానాల ఫ్యూయల్ ధర 115 శాతం, దేశీయ విమానాల ఫ్యూయల్ ధర 107 శాతం పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడడం వల్ల చమురు కంపెనీలు విమాన ఇంధన ధరలను రికార్డు స్థాయికి పెంచాయి. ఇది విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా పెంచేస్తుంది.

టికెట్ రేట్లు ఎంత పెరగొచ్చు?

ఒక విమానయాన సంస్థ మొత్తం ఖర్చులో ఇంధనానికే సుమారు 40 శాతం వరకు ఖర్చు అవుతుంది. ఇంధన ధరలు ఇలాగే కొనసాగితే, విమాన సంస్థలు 'ఫ్యూయల్ సర్‌చార్జి' పేరుతో టికెట్ ధరలను కనీసం 15 నుంచి 25 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్ లో సాధారణంగా ప్రయాణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ధరలు పెరగడం వల్ల సామాన్యులు విమాన ప్రయాణాన్ని విరమించుకొని రైళ్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

మనుగడ ప్రశ్నార్థకం!

ఇప్పటికే అప్పుల్లో ఉన్న కొన్ని విమాన సంస్థలకు ఈ ధరల పెరుగుదల ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా మారింది. టికెట్ ధరలు పెంచితే ప్రయాణికులు తగ్గుతారు, పెంచకపోతే నష్టాలు వస్తాయి. ఈ సందిగ్ధంలో ఎయిర్ లైన్స్ సంస్థలు కొట్టుమిట్టాడుతున్నాయి. చిన్న నగరాలకు నడిపే విమానాల సర్వీసులను కొన్ని సంస్థలు రద్దు చేసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనివల్ల ప్రాంతీయ విమానయాన అనుసంధానం దెబ్బతింటుంది. సరుకు రవాణా చేసే విమానాల ద్వారా అత్యవసర మందులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర కార్గో సేవల ధరలు కూడా పెరుగుతాయి. విదేశీ పర్యాటకుల రాక తగ్గే అవకాశం ఉండడం వల్ల హోటళ్లు, టూరిజం రంగాలు కూడా దెబ్బతినవచ్చు.

విమాన ఇంధన ధర రూ. 2 లక్షల మార్కు దాటడం అనేది ఒక గడ్డు కాలానికి సంకేతం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏటీఎఫ్ పై పన్నులను భారీగా తగ్గించకపోతే, సామాన్యుడికి ఆకాశ ప్రయాణం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి చమురు ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ప్రయాణికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం విమాన టికెట్ బుక్ చేసుకునే ముందు మీ బడ్జెట్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది!

Tags:    

Similar News