ఇది 'జేపీ' విజ్ఞప్తి

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సమాజానికి మేలు చేసే నాయకుడికి ఓటేయండి

Update: 2024-05-11 11:04 GMT

‘ఓటు అనేది ఆ రోజు కలిగే ఆవేశంతోనో, ఆ పూట కలిగే కోపంతోనో, నేతలు ఇచ్చిన డబ్బు కోసమో, రేపు ఎవరో ఏదో ఇస్తారనే ఆశతోనో, మద్యం మత్తులోనో వేసేది కాదు. కొద్దిగా రేపు ఏం జరగబోతుందో ఆలోచించి, జాగ్రత్తగా ఓటు వేయండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సమాజానికి మేలు చేసే నాయకుడికి ఓటేయండి. ఏ పార్టీ అయినా సరే.. బడిత ఉన్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది. అధికారం కేంద్రీకరించి తమ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఓటేయాలి..? నేతలంతా ఒక్కటే కదా.. ఇక్కడున్న నేత అక్కడికి, అక్కడున్న నేత ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. ఎవరిని ఎన్నుకోవాలి..? ఈ పరిస్థితిలో నాకు ఒకే ఒక్క ఆశాకిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్తు కాపాడాలి, మనందరికి మంచి జీవితం కావాలంటే.. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడానికి తోడ్పడే నాయకుడిని ఎంచుకోవాలి. డబ్బంతా తాత్కాలిక తాయిలాలకు ఖర్చుపెట్టే నాయకుడు కచ్చితంగా ప్రమాదకరం’ అంటూ లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి ఇప్పుడు చర్చానీయాశంగా మారింది.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఇంట్లో ఉండకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని .. అది మనందరి బాధ్యతని అన్నారు. ఎవరికి ఓటేయాలనే దానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, ఉన్నంతలో మంచి నాయకుడిని ఎంచుకోవాలని సూచించారు.

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచించి, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ సృష్టికి అనువైన చర్యలు చేపట్టే నాయకులకు మద్దతివ్వాలని కోరారు. రేపటి గురించి ఆలోచించి పనిచేసే నాయకుడిని గుర్తించి, అతడికి ఓటేసి గెలిపించుకోవాలని జేపీ సూచించారు.

Tags:    

Similar News