''చంద్రబాబు వల్లే అనైతిక వ్యవహారాలు'' మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూస్తున్న పలు అనైతిక వ్యవహారాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణమంటూ ధ్వజమెత్తారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూస్తున్న పలు అనైతిక వ్యవహారాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణమంటూ ధ్వజమెత్తారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుత్తా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారం నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై జగన్ పలు ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు పలు అనైతిక వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోతున్నా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ కారణంగానే కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారని జగన్ ధ్వజమెత్తారు.
కూటమి ప్రజాప్రతినిధుల అనైతిక వ్యవహారాలపై మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్లను ప్రస్తావిస్తూ జగన్ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. సీఎం చంద్రబాబు కుమారుడు స్విమ్మింగ్ పూల్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే నో యాక్షన్.. సీఎం చంద్రబాబు బావ మరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపు అయినా చేయాలని బహిరంగంగా మాట్లాడినా నో యాక్షన్.. అంటూ జగన్ విమర్శలు గుప్పించారు. అలాంటి పనులు తప్పు అని వారించకుండా చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అనడం చూస్తే, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతోందని జగన్ వ్యాఖ్యానించారు.
ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఇటీవల వెలుగుచూసిన పలు లైంగిక దాడుల కేసులను ప్రస్తావించారు. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించలేదని అన్నారు. తప్పుచేసిన వారి పట్ల ఆయన చర్యలు తీసుకోవడం లేదు, అందుకే విచ్చలవిడిగా ఇలాంటి పనులు జరుగుతున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలు అంట అంటూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయితీ చేశారని ఆరోపించారు.
కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చర్యలు తీసుకోలేదని, మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్ అంటూ జగన్ ఎత్తిచూపారు. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద కూడా చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. టీటీడీ చైర్మన్ మీదా నో యాక్షన్, వీడియో, ఫొటోలతో పట్టుబడినా నో యాక్షన్, ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే నో యాక్షన్ ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.