ఐప్యాక్ డిప్యూటీ చీఫ్ వినేష్ అరెస్ట్: బెంగాల్ ఎన్నికలపై ప్రభావమెంత?
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ డిప్యూటీ చీఫ్ వినేష్ చండేల్ను ఈడీ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.;
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23, 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార పార్టీని కార్నర్ చేస్తూ.. బీజేపీ చేస్తున్న రాజకీయాల దూకుడు పెరిగింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ డిప్యూటీ చీఫ్ వినేష్ చండేల్ను ఈడీ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం.. ఆయనను ఢిల్లీ కోర్టుకు సరెండర్ చేశారు. అయితే.. ఆ వెంటనే ఈడీ అధికారులు ఆయనను తమ కస్టడీకి కోరడం.. కోర్టు సైతం దీనికి ఆమోదం తెలపడం.. చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలను ప్రశ్నించరాదు. కానీ.. దీనివెనుక జరుగుతున్న పరిణామాలే ఇప్పుడు ఆశ్చర్యానికి బెంగాల్ ఎన్నికలపై చూపుతున్న ప్రభావానికి కారణమవుతున్నాయని అంటున్నారు.
ఏంటి కేసు?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరు మాసాల కిందట బొగ్గు కుంభకోణం వెలుగు చూసింది. దీనిద్వారా సమ కూరిన సొమ్ము మనీలాండరింగ్ రూపంలో ఐప్యాక్కు చేరిందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎన్నికల వ్యూహకర్తగా ఒప్పందం కూడా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐప్యాక్ సంస్థలపై ఈడీ దాడులు చేయడానికి వచ్చినప్పుడు.. రాష్ట్రంలో పెను వివాదం చోటు చేసుకుంది. తమ విధులను అడ్డుకుంటున్నారని ఈడీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కాగా.. కీలక ఎన్నికల సమయంలో వ్యూహకర్త అరెస్టు కావడం.. ఐప్యాక్ సిబ్బంది కార్యాలయాలు కూడా ఖాళీ కావడంతో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కు మరింత సంకట స్థితి ఏర్పడింది. అయితే.. ఈ అరెస్టు ను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. తమపై ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దాడిగా ఆమె పేర్కొన్నారు. దొడ్డిదారిలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా పడే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.