హైకోర్టులోనూ రెడ్ సిగ్నల్.. జనసేనకు షాక్ మీద షాక్!

హైదరాబాద్ గచ్చిబౌలిలో నవ నిర్మాణ సభకు అనుమతి కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2026-06-02 09:38 GMT

హైదరాబాద్ గచ్చిబౌలిలో నవ నిర్మాణ సభకు అనుమతి కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిసన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనసేన సభకు అన్నిదారులు మూసుకుపోయినట్లేనని అంటున్నారు. ఇక జనసేనాని పవన్ నిర్వహిస్తామన్న ప్రెస్ మీట్ పైనే అందరు ఫోకస్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో జనసేన నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడతానని పవన్ ఎక్స్ లో ప్రకటించారు. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరారు.

హైదరాబాద్ లో సభ నిర్వహిస్తామని జనసేన ప్రకటించిన అప్పటి నుంచి రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఏపీ ఉప ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని అంటూ అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షంలోని టీఆర్ఎస్ నేత కవిత వంటివారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కోసమే పవన్ సభ పెడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వంటివారు ఎదురుదాడి చేస్తున్నారు. పవన్ సభను ప్రభుత్వమే వ్యతిరేకిస్తుండటం వల్ల ఆయనకు అనుమతి లభించడం లేదని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించిన జనసేన, సానుకూల నిర్ణయం వస్తుందని ఎదురుచూసింది. ఈ మేరకు ఎక్స్ లో మరో ట్వీట్ కూడా చేసింది. నవ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలియజేస్తూ, హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తున్నట్లు ఆ ట్వీట్ లో వెల్లడించింది. కోర్టు నిర్ణయం వచ్చే వరకు సభ ఏర్పాట్లు యథావిధిగా కొనసాగతాయని, కోర్టు అనుమతిస్తే సభ నిర్వహిస్తామని వెల్లడించింది. అంతవరకు కార్యకర్తలు ఎదురుచూడాలని ఆ ట్వీట్ లో కోరింది. అయితే కోర్టులో కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు జనసేనాని నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడమే ఆ పార్టీ ముందు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయమని అంటున్నారు.

ఇక కొద్దిరోజులుగా పవన్ చుట్టూ తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ అనివార్యంగా తెలంగాణపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం చెలరేగడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూతో కొద్దిరోజులుగా జనసేన వర్సెస్ తెలంగాణ జర్నలిస్టులు, మేథావులు అన్నట్లు వాగ్యుద్ధం జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా అన్నట్లు హైదరాబాద్ లో సభ పెడతానంటూ పవన్ ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రభుత్వం కూడా పవన్ సభను వ్యతిరేకించడంతో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News