గుంటూరు వైసీపీలో 'వారసురాలి' రచ్చ.. !
అసలే గుంటూరు. రాజధాని జిల్లా. పైగా టీడీపీకి బలమైన నాయకగణం ఉండడంతోపాటు సీఎం చంద్రబా బు, మంత్రి నారా లోకేష్లు నిరంతరం ఇక్కడే తిరుగుతుంటారు.;
అసలే గుంటూరు. రాజధాని జిల్లా. పైగా టీడీపీకి బలమైన నాయకగణం ఉండడంతోపాటు సీఎం చంద్రబా బు, మంత్రి నారా లోకేష్లు నిరంతరం ఇక్కడే తిరుగుతుంటారు. ఈ ప్రభావం నియోజకవర్గాలపైనా ఉంటుంది. ఇక, పలు నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాలు.. దీనికితోడు రాజధాని మద్దతు పలికే వర్గాలు ఇలా.. రాజకీయంగా చూసుకుంటే టీడీపీకి అనేక బలమైన ప్లస్లు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ పాగా వేయాలంటే వైసీపీ ఏం చేయాలి..!
అంతకంటే బలంగా వ్యవహరించాలి. టీడీపీకి నిరంతరం.. చెక్ పెట్టేలాగా వ్యవహరించాలి. నిరంతరం నాయకులు కలివిడిగా ఉండాలి. కానీ ఇది కనిపిస్తోందా? అంటే లేదనే చెప్పాలి. పైగా.. కలివిడి పోయి విడివిడిగా రాజకీయాలు చేసుకునే పరిస్థితి వస్తోంది. ఇది పార్టీకి నాయకులకు కూడా తీరని నష్టంగా మారుతోంది. ఈ విషయం తెలిసి కూడా పార్టీ అధిష్టానం మౌనంగా ఉండడం మరో చిత్రమైన విషయం. దీంతో గుంటూరు వైసీపీలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది.
ఏం జరిగింది..?
గుంటూరు తూర్పు నుంచి గత ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె నూరి ఫాతిమా రంగంలోకి దిగారు. వారసురాలిగా ఆయన ప్రమోట్ చేయడంతో.. జగన్ కాదనలేక పోయారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆమె కూటమి వేవ్లో నసీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి 2014లో బలమైన టీడీపీ గాలి వీచినప్పుడు కూడా ముస్తాఫా విజయం దక్కించుకున్నారు. అయినా.. నూరిని వైసీపీ నాయకులు తమ నేతగా స్వాగతించలేక పోయారన్న వాదన ఉంది. ఈ విషయాన్ని గ్రహించైనా ఆమె అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంది.
కానీ, అలా జరగలేదు. పైగా.. గుంటూరు వైసీపీ ఇంచార్జ్ బాధ్యతలను దక్కించుకున్నారు. ఆ తర్వాత.. మరిన్ని సెగలు.. పొగలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఇఫ్తార్ విందు ను గుంటూరులో ఏర్పాటు చేయాలని అనుకున్నా.. నూరి వ్యవహార శైలితో నాయకులు చివరి నిమిషంలో విరమించుకున్నారు. తనే చేస్తున్నట్టు ఆమె బిల్డప్ ఇచ్చిందని.. ఫ్లెక్సీలపై తన ఫొటోలే వేసుకుందని విమర్శలు వచ్చాయి. దీంతో ఇఫ్తార్ మకాంను పార్టీ విజయవాడకు మార్చేసింది. ఇక్కడితో కథ అయిపోలేదు. భవిష్యత్తులో ఈ సెగ కొనసాగుతుందని.. నాయకులు అంటున్నారు. వారసురాలి దూకుడును కట్టడి చేయాలని కోరుతున్నారు. మరి జగన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి.