ఏంటి క్వాంటమ్ కమ్యూనికేషన్స్.. భారత్ సాధించిన గొప్పతనం ఏమిటి?
ఇది భవిష్యత్ కమ్యూనికేషన్ పద్ధతులకు ఒక నూతన మార్గాన్ని చూపడమే కాకుండా అంతర్జాతీయ సాంకేతిక రంగంలో భారతదేశ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.;

21వ శతాబ్దంలో సమాచార భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది. సైనిక, ఆర్థిక, టెలికమ్యూనికేషన్స్, జాతీయ నిఘా వంటి అన్ని రంగాల్లో గోప్యత, హ్యాకింగ్-రహిత వ్యవస్థల అవసరం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత సురక్షితమైన సమాచార మార్పిడి సాంకేతికతగా పరిగణించబడుతున్న క్వాంటమ్ కమ్యూనికేషన్లో భారతదేశం ఒక అపూర్వమైన ఘనతను సాధించింది. ఇది భవిష్యత్ కమ్యూనికేషన్ పద్ధతులకు ఒక నూతన మార్గాన్ని చూపడమే కాకుండా అంతర్జాతీయ సాంకేతిక రంగంలో భారతదేశ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.
-డీఆర్డీఓ, ఐఐటీ ఢిల్లీల సంయుక్త విజయం
భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO) , ప్రఖ్యాత భారత విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా "ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్" ద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగంలో సెకన్కు 250 బిట్స్ సురక్షిత కీ రేటుతో సమాచార మార్పిడి జరిగింది. ఇది ఈ టెక్నాలజీ ద్వారా సమాచార మార్పిడిలో హ్యాకింగ్కు ఎటువంటి ఆస్కారం లేకుండా గోప్యత పూర్తిగా కాపాడబడుతుందని నిరూపించింది. ఈ విజయాన్ని రక్షణ శాఖ స్వయంగా వెల్లడించగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలను అభినందించారు.
-క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా మనం ఇంటర్నెట్ ద్వారా డేటాను పంపినప్పుడు, అది కేబుళ్లు లేదా ఫైబర్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ సమయంలో హ్యాకర్లు మధ్యలో అడ్డగించి మోసగించే అవకాశం ఉంటుంది. అయితే క్వాంటమ్ కమ్యూనికేషన్ పద్ధతిలో సమాచారం ఒక ఫోటాన్ (కాంతి కణం) రూపంలో ప్రయాణిస్తుంది. ఈ ఫోటాన్ను ఎవరైనా తిప్పి చూడాలనుకుంటే, దాని ప్రాపర్టీస్ మారిపోతాయి. ఈ మార్పు వెంటనే సమాచారం పంపినవారికి తెలిసిపోతుంది. అంటే ఇది వాస్తవానికి "అన్హ్యాకబుల్ టెక్నాలజీ".
-క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ - ఈ టెక్నాలజీకి గుండెకాయ
క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఉపయోగించే ప్రధాన సూత్రం "క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్". దీని ద్వారా రెండు ఫోటాన్లు (కాంతి కణాలు) ఎంత దూరంలో ఉన్నా, ఒకదానిపై జరిగే మార్పు వెంటనే మరొకదానిపై ప్రతిబింబిస్తుంది. దీనిని నాగార్జున "హలో బ్రదర్" సినిమా ఉదాహరణతో వివరించవచ్చు. ఇద్దరు కవలల్లో ఒకడు డ్యాన్స్ చేస్తే ఇంకొక్కడు కూడా అదే కదలికలు చేస్తాడు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో కూడా ఒక కణంలో జరిగిన మార్పు మరొక కణంలో దానితో "అదృశ్యంగా" కనెక్ట్ అయ్యి ప్రతిబింబిస్తుంది. దీనివల్ల డేటా మార్పిడి అత్యంత వేగంగా సురక్షితంగా జరుగుతుంది.
-"ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్" పద్ధతి ప్రత్యేకత
ఈ ప్రయోగాన్ని ఐఐటీ ఢిల్లీ క్యాంపస్లో "ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్" ద్వారా నిర్వహించారు. ఈ విధానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎలాంటి కేబుల్ అవసరం లేదు. సమాచార మార్పిడి వాయు ద్వారా జరుగుతుంది. ఈ విధానం ద్వారా రెండు భవంతుల మధ్య, లేదా భవిష్యత్తులో శాటిలైట్ల మధ్య కూడా డేటా పంపవచ్చు. ఇది క్వాంటమ్ కమ్యూనికేషన్ విస్తరణకు ఒక ముఖ్యమైన ముందడుగు.
-భారత్ సాధించిన ప్రయోజనాలు
ఈ విజయం భారతదేశానికి అనేక ప్రయోజనాలను చేకూర్చనుంది. హ్యాకింగ్ అసాధ్యం కావడంతో అత్యంత సున్నితమైన సమాచార మార్పిడికి మార్గం సుగమం అవుతుంది.సైనిక సమాచారం, రహస్య ఇంటెలిజెన్స్ మార్పిడికి కొత్త దారులు తీస్తుంది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్క్రిప్షన్ లేని కమ్యూనికేషన్స్కు భవిష్యత్ మార్గదర్శనం చేయనుంది. ప్రస్తుత ఎన్క్రిప్షన్ పద్ధతులు భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా బ్రేక్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ టెక్నాలజీ భవిష్యత్తుకు భద్రతను అందిస్తుంది. భారతదేశపు సొంత క్వాంటమ్ నెట్వర్క్లు, అల్ట్రాసెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పడే బాట వేస్తుంది. దేశీయంగా సురక్షితమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఇది పునాది వేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక శక్తిగా ఎదగడానికి తోడ్పాటునందిస్తుంది. ఈ రంగంలో అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాలతో పాటు భారత్ కూడా అదే స్థాయిలో నిలబడింది.
భవిష్యత్తులో భారతదేశం క్వాంటమ్ కమ్యూనికేషన్ను జాతీయ భద్రత, సైనిక రంగం, ఆర్థిక వ్యవస్థ , టెలికమ్యూనికేషన్ రంగాలలో విస్తృతంగా ఉపయోగించనుంది. అంతర్జాతీయంగా ఈ టెక్నాలజీతో ముందున్న దేశాల సరసన భారత్ చేరడం దేశానికి గర్వకారణం. ఈ ప్రయోగ విజయంతో భారత్ ప్రపంచ అత్యున్నత సాంకేతిక శక్తిగా మరో మెట్టు ఎక్కింది. సమాచార భద్రత విషయంలో భారత్ ఇప్పుడు ఇతర దేశాలకు స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. భవిష్యత్ టెక్నాలజీ ప్రపంచంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. "క్వాంటమ్ కమ్యూనికేషన్" - భద్రత, వేగం, గోప్యతకు కొత్త నిర్వచనం. ఇది నిజంగా భారతదేశానికి మరో గర్వకారణమైన విజయం.