స్టార్ హీరో ఆర్థిక కుంభకోణంపై విచారణ?
ఈ క్రిమినల్ కేసులో పేరున్న 13 మందిలో ఇద్దరు కేతన్ కదమ్ (50) , జే జోషి (49) ఇదివరకే అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.;

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అతడి సోదరుడు మురికి నది పూడిక తీత కుంభకోణంలో నిందితులుగా పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. కోట్లాది రూపాయల మిథి నది(ముంబై) పూడికతీత కుంభకోణం కేసుకు సంబంధించి హిందీ నటుడు డినో మోరియా, అతడి సోదరుడు శాంటినో మోరియోను ముంబై నగర పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) సోమవారం 8 గంటల పాటు విచారించిందని తెలుస్తోంది. క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలోని పోలీసు కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవోడబ్ల్యూ కార్యాలయానికి డినో, అతడి సోదరుడు శాంటినో ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చి సాయంత్రం 7 గంటలకు వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత మోరియాలను ఈవోడబ్ల్యూ కార్యాలయానికి తిరిగి రావాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ క్రిమినల్ కేసులో పేరున్న 13 మందిలో ఇద్దరు కేతన్ కదమ్ (50) , జే జోషి (49) ఇదివరకే అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. మితి నదిలో పూడిక తీయకుండా నకిలీ బిల్లులు సమర్పించి డబ్బు కొట్టేయడంతో నిందితులు పౌర సంస్థకు రూ. 65.5 కోట్ల నష్టం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి.
కదమ్ , డినో చాలా కాలంగా ఒకరికొకరు తెలిసినవారని పోలీసులు తెలిపారు. కదమ్-మోరియాల మధ్య ఏవైనా లావాదేవీలు ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నామని ఒక ఈవోడబ్ల్యూ అధికారి తెలిపారు. డీసిల్టింగ్ కాంట్రాక్ట్ సహా బీఎంసీలో ఒప్పందాలను డినో ప్రభావితం చేశాడని అనుమానిస్తున్నట్టు అధికారులు తెలిపారు.