కూటమి 'గేట్లు' తెరుస్తారా ..!
దీంతో ఒకానొక సందర్భంలో పొరుగు పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోరాదన్న వ్యూహాన్ని అమలు చేశారు.;
గత ఎన్నికల తర్వాత.. పార్టీలు మారిన వారు నిన్న మొన్నటి వరకు.. ఆవేదనలో మునిగిపోయారు. తమకు వచ్చే ఎన్నికల్లో.. అవకాశందక్కుతుందా..? పార్టీలు టికెట్లు ఇస్తాయా? అనే సందేహం వారిలో ఉండేది. దీనికి కారణం.. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరేసి నాయకులు ఉండడమే. దీంతో పార్టీలకు కూడా ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. దీంతో ఒకానొక సందర్భంలో పొరుగు పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోరాదన్న వ్యూహాన్ని అమలు చేశారు.
అయినప్పటికీ.. కొన్ని సార్లు కొంతమంది నాయకులను చేర్చుకున్నారు. ఇక, కూటమిలో బలంగా ఉన్న టీడీపీ కాదంటే.. జనసేనలోకి వెళ్లిన వారు ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా తమకు అవసరం లేదంటే.. బీజేపీ పంచన చేరిన నాయకులు కూడా ఉన్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారనుంది. వచ్చే ఎన్నికల నాటికి దాదాపు 88 స్థానాలు పెరుగుతున్నాయి. పైగా.. మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త నేతలతోపాటు.. బలమైన నాయకులను చేర్చుకునే వ్యూహాలకు పార్టీలు తెరదీస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్న పార్టీ.. టీడీపీ. ఈ పార్టీలోకి వచ్చేందుకు వైసీపీ నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారని.. ఇటీవల లోకేష్ కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం.. టీడీపీలో ఉన్న నాయకులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వలేక పోతున్నామన్నారు. కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు.. పరిణామాలను అంచనా వేస్తున్న టీడీపీ.. గెలుపు గుర్రాలకు గేట్లుతెరవాలని నిర్ణయించే దిశగా అడుగులు వేస్తోంది.
ఇదే జరిగితే.. వైసీపీ నుంచి కొంతమంది నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక, తటస్థంగా ఉన్న నాయకుల పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక, ఇదే పంథాలో జనసేన కూడా ముందుకు సాగనుంది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి.. వచ్చే వారిని ఆహ్వానించేందుకు ఆ పార్టీ కూడా రెడీ అయింది.. మొత్తంగా జంపింగులకు రాబోయే రోజుల్లో మరింత వెసులుబాట్లు కల్పించనున్నారు. అయితే.. ఇది వారి వ్యక్తిగత సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.