మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. తాటతీస్తాం: చంద్రబాబు ఫైర్
వైసీపీ రాజకీయాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని.. పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ రాజకీయాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని.. పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిని నెలకొల్పి.. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇలాంటివారిని చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తాటతీస్తామని హెచ్చరించారు. డీఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించి.. 16 వేల మంది ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
అయితే.. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవాలని.. ప్రజలను ప్రభుత్వంపై ఆధారపడి బతికే వారిలా చేయాలని భావించిన వైసీపీ.. నేతలు.. డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తే కూడా మనసు ఊరుకోవడం లేదని విమర్శించారు. దీనిని కూడా రాజకీయం చేయాలని భావిస్తున్నారని.. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివారి విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వైసీపీ నేతలు.. సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు.
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ నాయకులేనని.. ఆ విషయం వారికి కూడా తెలుసునని చంద్రబాబు చెప్పారు. అయితే.. గతంలో వివేకాను హత్య చేసి తన చేతికి రక్తం పూసే ప్రయత్నం చేసినట్టే.. ఇప్పుడు కూడా వైఎస్ విగ్రహా న్ని ధ్వంసం చేసి టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు పక్కాగా వ్యవహరించి అన్ని ఆధారాలను వెలికి తీయడంతో వైసీపీ నేతల బందారం బట్ట బయలైందని పేర్కొన్నారు. ఇలాంటి అరాచక శక్తులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.
ప్రతి హామీ నెరవేరుస్తున్నాం..
ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని.. ఇంటికే పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. పింఛనును 4 వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 21 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా సాధించామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను అమలు చేసి.. మాట నిలబెట్టుకుంటామని చెప్పారు.