ఫస్ట్ డే.. తమిళనాట చంద్రబాబు ప్రచారం ఇలా..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు సోమవారం సాయంత్రం కోయంబత్తూరువెళ్లారు.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు సోమవారం సాయంత్రం కోయంబత్తూరుకు వెళ్లారు. రెండురోజుల పాటు ఆయన ఇక్కడే ఉండి ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. తొలిరోజు మాత్రం చంద్రబాబు పారిశ్రామికవేత్తలు,పెట్టుబడి దారులతో సమావేశమయ్యారు. అనంతరం.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. తొలుత పారిశ్రామిక వేత్తలతోనూ..తర్వాత.. రోడ్ షోలోనూ చంద్రబాబు ప్రసంగించారు.
పారిశ్రామిక వేత్తలతో..
పారిశ్రామిక వేత్తలతో మాట్లాడిన చంద్రబాబు ఎన్డీయే భాగస్వామ్యంతో ఏపీలో అనేక పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తమిళనాడులోనూ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయితే.. పెట్టుబడులకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా సహకారం అందిస్తోందని చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి ఎన్డీయే భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ప్రధాని మోడీ సారథ్యంలోనే ఇది సాకారం అవుతుందన్నారు.
రోడ్ షోలో..
కోయంబత్తూరు రోడ్షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడే పార్టీలను గెలిపించవద్దని పిలుపునిచ్చారు. తమిళనాడు-ఏపీకి మధ్య అనుబంధం ఎంతో ఉందని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా.. తమిళనాడుకు నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా కృష్ణా-కావేరీ నదుల అనుసంధానం కోసం తాను ప్రయత్నాలు చేస్తున్నానని.. ఇది ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం ఉంటేనే సాకారం అవుతుందని.. తద్వారా.. తమిళనాడు దాహార్తి తీర్చేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమిళనాడు డెవలప్ కావాలంటే.. ఎన్డీయేతోనే సాకారం అవుతుందని పిలుపునిచ్చారు.