మండుటెండలో ఐదున్నర కిలో మీటర్లు సైకిల్ తొక్కిన బాబు.. రీజనేంటి?
సైకిలింగ్ అనేది జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సైకిలింగ్ అనేది జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి మండు టెండలో ఐదున్నర కిలో మీటర్లు సైకిల్ తొక్కి ఆదర్శంగా నిలిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి నొవాటెల్ హోటల్ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. దీనికి ముందు.. వర్సిటీ క్యాంపస్ లో మొక్కను నాటారు. ఇది ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన పాటించారు.
మొక్కకు `అమ్మణమ్మ`(చంద్రబాబు మాతృమూర్తి)గా పేరు పెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా తో మాట్లాడుతూ.. విశాఖలో ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 50 శాతం గ్రీనరీ పెంచేలా చర్యలు చేపడతున్నామన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టు దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్లోనూ చర్యలు తీసుకుంటామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే 5,18000 రూపాయల విలువైన విద్యుత్ను ఆదా చేశామన్నారు.
కాగా.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా శుక్రవారం జరుపుకుంటున్నారు. ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం,మన భవిష్యత్తు కోసం- అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్య రాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్నిజరుపుకుంటున్నారు.
అడవుల నరికివేత, వాహనాల కాలుష్యం , ప్లాస్టిక్ ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో మోతాదుకు మించి ఎరువుల వినియోగం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి వాహనాలను, విద్యుత్ ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
మైలవరంలో పవన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఇక్కడి పార్కులో మొక్కలు నాటారు. పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అటవీ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో అటవీ సంపదను పరిరక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటితే.. చాలని ఆయన పిలుపునిచ్చారు.