చంద్రబాబును అరెస్టు చేసిన ఐపీఎస్ కు అదనపు వేతనం?
డీఐజీ హోదాలో పనిచేస్తున్న కొల్లి గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పనిచేశారని టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు.;

కూటమి సర్కారు తీసుకున్న ఓ నిర్ణయంపై టీడీపీ కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కారులో అడ్డగోలుగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏ పోస్టింగు లేకుండా ఖాళీగా ఉన్న ఓ ఐపీఎస్ అధికారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ ఐపీఎస్ చేసిన పనులు అన్నింటిలోనూ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ప్రధానమైనది. సహజంగా ఇలా అరెస్టు చేసిన వారిని ఎవరైనా అధికారంలో ఉండగా, ఏదో రకంగా వేధిస్తారు. కానీ, కూటమి సర్కారు మాత్రం చంద్రబాబు అరెస్టుతో ఆ ఐపీఎస్ చేసిన అదనపు పనికి అదనపు వేతనం ఇచ్చింది. వినడానికి విడ్డూరంగా అనిపించిన నిబంధనల ప్రకారం చెల్లించక తప్పలేదని అంటున్నారు.
అవును ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అదనపు వేతనం చెల్లిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా కూటమి పార్టీల కార్యకర్తలు సర్కారు నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే నిబంధనలు అన్నీ రఘురామిరెడ్డికి అనుకూలంగా ఉండటంతో అదనపు వేతనం చెల్లించక తప్పలేదని అంటున్నారు. అధికారిక నిబంధనల ప్రకారం ‘ఫుల్ అడిషనల్ చార్జి’ కింద పనిచేసే అధికారులకు అదనపు వేతనం ఇవ్వాలనేది రూల్ అట. అందుకే చంద్రబాబు ప్రభుత్వం కూడా గతంలో రఘురామిరెడ్డి పనిచేసిన అదనపు పనికి వేతనం చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి కొల్లికి అనేక బాధ్యతలు అప్పగించారు. డీఐజీ హోదాలో పనిచేస్తున్న ఆయనకు రాజధాని అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయనే అంశంపై వేసిన సిట్ కు అధిపతిగా నియమించారు. వాస్తవానికి ఆయన విజిలెన్స్ శాఖలో పనిచేస్తుండగా, చంద్రబాబు, టీడీపీ నేతల టార్గెట్ గా నమోదు చేసిన కేసుల విచారణ బాధ్యతలను కొల్లికే అప్పగించేవారు. రాజధాని భూములతోపాటు సీఐడీ, ఏసీబీ కేసులను కూడా అదనంగా ఐపీఎస్ కొల్లికే అప్పగించేవారు. ఈ విధంగా చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు బాధ్యత కొల్లికే ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనలతో నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేశారంటున్నారు.
డీఐజీ హోదాలో పనిచేస్తున్న కొల్లి గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పనిచేశారని టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనను పక్కన పెట్టారు. అయినప్పటికీ ఆయన గత ప్రభుత్వంలో చేసిన అదనపు పనికి ఇప్పుడు వేతనం చెల్లించాల్సిరావడం చర్చకు దారితీసింది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఐపీఎస్ కొల్లి తన అదనపు పనికి వేతనం చెల్లించాలని దరఖాస్తు సమర్పించారు. అయితే అప్పట్లో ఎన్నికలు జరుగుతుండటం వల్ల ఆయన దరఖాస్తు పరిశీలన దశలోనే నిలిచిపోయింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికి ఐపీఎస్ అధికారి కొల్లి దరఖాస్తును పరిష్కరించాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కనుక ఐపీఎస్ అధికారి కొల్లి పెట్టుకున్న దరఖాస్తును పరిష్కరించి అదనపు వేతనం చెల్లించిందని, అదే చంద్రబాబు స్థానంలో వేరెవరైనా ఉంటే ఇలా చెల్లించేవారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.