ఈవీఎంల పనితీరు మార్చేస్తా.. ఆ ఆర్మీ జవాన్

కష్టపడకుండా కోట్లు దోచుకోవాలని కుట్ర పన్ని పోలీసుల చేతికి చిక్కాడు.

Update: 2024-05-08 07:12 GMT

అసలే ఈవీఎంల పనితీరుపై అందరికి సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆర్మీ జవాన్ వాటి పనితీరు మారుస్తానని బేరం మాట్లాడుకోవడం సంచలనం కలిగిస్తోంది. తమకు అనుకూలంగా ఈవీఎంల పనితీరు మారిస్తే రూ. 2.5 కోట్లు ఇవ్వాలని బేరం మాట్లాడుకుని అడ్డంగా బుక్కయ్యాడు. సంపాదించకుండా వచ్చిందేది నిలవదు. అడ్డదారుల్లో సంపాదిస్తే అంతే సంగతి అనే విషయం మనవాడికి తెలియనట్లుంది. కష్టపడకుండా కోట్లు దోచుకోవాలని కుట్ర పన్ని పోలీసుల చేతికి చిక్కాడు.

వివరాల్లోకి వెళితే మారుతి దక్నే అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నాడు. పుణెలోమహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత, శివసేన నాయకుడు అంబాదాస్ దన్వేను కలిశాడు. మీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్ ను ఉపయోగించి ఈవీఎంలను మారుస్తానని నమ్మబలికాడు. దానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీంతో అతడిని పోలీసులకు పట్టించాలని అనుకున్నాడు. వారికి ముందస్తు సమాచారం అందజేశాడు. వ్యూహంలో భాగంగా మంగళవారం సాయంత్రం దన్వే సోదరుడు రాజేంద్ర, నిందితుడిని హోటల్ కు రమ్మని ఆహ్వానించాడు. అక్కడ రూ. 1.5 కోట్లకు డీల్ మాట్లాడుకున్నారు. టోకెన్ అడ్వాన్స్ కింది రూ. లక్ష ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాచిన పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Read more!

చేసిన అప్పులు తీర్చలేక ఇలా అడ్డదారుల్లో సంపాదించి తన బాకీలు తీర్చుకోవాలని పథకం పన్నాడు. దురాశ దుఖానికి చేటు అన్నట్లు ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్ లో విధులు నిర్వహిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నేరగాళ్లు బయలుదేరతారు. వారితో జాగ్రత్త. ఈవీఎంలలో మోసాలు ఉండకుండా చూసే బాధ్యత అధికారులదే. ఈవీఎంల పనితీరుపై సుప్రీంకోర్టులో సైతం పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఎలక్ర్టానిక్ యంత్రాల వినియోగం మీద అనుమానాలు రావడం సహజమే. ఇలాంటి ఘటనలే వాటికి ఊతం పోస్తాయనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News