విమాన ప్రమాదం... ఎయిరిండియా బ్లాక్ బాక్స్ కు ఏమైంది?
అహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.;

అహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం.. కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందారు. ఈ సమయంలో ఇటీవల ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది.
విమానం ఢీకొన్న రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పైకప్పు వద్ద ఈ పరికరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందం స్వాధీనం చేసుకొంది. ఇందులో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్.డీ.ఆర్), కాక్ పీట్ వాయిస్ రికార్డర్ (సీ.వీ.ఆర్)లు ప్రమాద దర్యాప్తులో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు.
ఇలా.. ఈ ప్రమాద దర్యాప్తులో అత్యంత కీలకమైన ఈ బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో... అందులోని డేటాను విశ్లేషించేందుకు దాన్ని విదేశాలకు పంపించేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా.. అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇలా.. అత్యంత కీలకమైన ఈ బ్లాక్ బాక్స్ ను అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి పంపే సమయంలో ప్రొటో కాల్స్ పాటించడంతో పాటు భారత్ కు చెందిన అధికారుల బృందం కూడా వెళ్తుందని అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే... దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
కాగా... ఈ బ్లాక్ బాక్స్ లో ఫ్యాక్ చేయబడిన రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్.డీ.ఆర్). ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నావిగేషన్ వివరాలు వంటి సంకేతిక డేటాను రికార్డ్ చేస్తుంది. ఇక రెండోది.. కాక్ పీట్ వాయిస్ రికార్డర్ (సీ.వీ.ఆర్). ఇది పైలట్ సంభాషణలు, ఫ్లైట్ డెక్ నుంచి వచ్చే ఇతర శబ్ధాలను సేవ్ చేస్తుంది.
ఈ రెండు రికార్డులు కలిసి 25 గంటలకు పైగా విమాన డేటాను, రెండు గంటల వాయిస్ రికార్డింగులను నిల్వ చేయగలవు. సాధారణంగా విమానం ముందు వైపు కూలిపోతుంది కాబట్టి.. క్రాష్ ప్రూఫ్ పరికరం విమానం తోక దగ్గర ఉంటుంది. ఈ పరికరం క్రాష్ తర్వాత అనేక సందేహాలకు సమాధానాలను ఇస్తుందని అంటారు.