ఆ విషయంలో డాక్టర్లకు చెక్.. ఇక ఇవ్వి మారాల్సిందేనట..
డాక్టర్ల రాత అంటే ఇప్పటి వరకు ఒక రహస్య కోడ్. రోగికి చేతికి ముందుల చీటి ఇస్తే.. అందులో ఏముందో తెలిసేది ఒక్క మెడికల్ షాపులో ఉన్న వ్యక్తికే.;
డాక్టర్ల రాత అంటే ఇప్పటి వరకు ఒక రహస్య కోడ్. రోగికి చేతికి ముందుల చీటి ఇస్తే.. అందులో ఏముందో తెలిసేది ఒక్క మెడికల్ షాపులో ఉన్న వ్యక్తికే. ఔషదం పేరు ముందు ఉందా..? లేదంటే మోతాదా ముందు ఉందా..? ఈ మెడిసిన్ ను ఉదయం తీసుకోవాలా? లేదంటే రాత్రి తీసుకోవాలా? అన్నది కూడా చాలాసార్లు రోగికి అర్థం అయ్యేది కాదు.. ఈ గందరగోళాన్ని మనం సరదాగా తీసుకున్న సందర్భాలే ఎక్కువ. కానీ అదే గందరగోళం కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పుగా మారుతుందన్న నిజం ఇప్పుడు అధికారుల దృష్టికి వచ్చింది. అందుకే డాక్టర్ల గజిబిజి రాతలకు నేషనల్ మెడికల్ కమిషన్ చెల్లుచీటి ఇచ్చింది.
మంచి నిర్ణయం అంటున్న రోగులు..
ఇకపై డాక్టర్లు రాసే మందుల వివరాలు స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ముఖ్యంగా మందుల పేర్లు తప్పనిసరిగా స్పష్టమైన ఇంగ్లీష్ అక్షరాల్లో ఉండాలని సూచించింది. ఈ నిర్ణయం వినడానికి చిన్న మార్పులా అనిపించినా, దీని ప్రభావం మాత్రం పెద్దదే. ఎందుకంటే ఇది నేరుగా రోగి భద్రతతో ముడిపడుతుంది. ఒక మందు తప్పుగా అర్థం చేసుకోవడం, మోతాదు ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవడం వంటి పొరపాట్లు చాలాసార్లు డాక్టర్ రాత స్పష్టంగా లేకపోవడం వల్లే జరుగుతుంటాయి. మన ఆరోగ్య వ్యవస్థలో రోగి ఇప్పటి వరకు ఎక్కువగా ఆధారపడేది డాక్టర్ మీద, ఫార్మసిస్ట్ మీదే. మందు ఎందుకు ఇస్తున్నారు, అది ఎలా పని చేస్తుంది, ఎన్ని రోజులు వాడాలి అన్న ప్రశ్నలు అడగడానికి చాలా మంది సంకోచిస్తారు. పైగా చీటీలో ఏముందో చదవలేని పరిస్థితి ఉండడంతో రోగి పూర్తిగా ఇతరుల మీదే ఆధారపడేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రావచ్చని భావిస్తున్నారు. మందు పేరు చదవగలిగితే, కనీసం అది ఏ రకమైన మందో తెలుసుకునే అవకాశం రోగికి ఉంటుంది.
తప్పదాలు తగ్గు అవకాశం..
ఈ నిర్ణయంతో మరో ముఖ్యమైన లాభం ఏంటంటే, మెడికల్ తప్పిదాలు తగ్గే అవకాశం. ఒకేలా కనిపించే, ఒకేలా వినిపించే మందుల పేర్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. గజిబిజి రాతల వల్ల ఒక మందు బదులు మరో మందు ఇచ్చిన ఘటనలు గతంలో ఎన్నో నమోదయ్యాయి. స్పష్టమైన రాత ఉంటే అలాంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. ఇది కేవలం రోగులకే కాదు, మందుల దుకాణాల్లో పనిచేసే వారికి కూడా ఉపశమనమే. అయితే ఈ నిర్ణయంపై కొందరు డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రోగుల సంఖ్య ఎక్కువ, సమయం తక్కువ అని వారు చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ప్రిస్క్రిప్షన్ను ఎంతో స్పష్టంగా రాయడం భారంగా మారుతుందని వాదించవచ్చు. కానీ ఆరోగ్య రంగంలో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యమని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక నిమిషం ఎక్కువ సమయం తీసుకొని స్పష్టంగా రాస్తే, ఒక రోగి జీవితాన్ని కాపాడినట్లే అవుతుంది.
డిజిటల్ ప్రిస్క్రిప్షన్ వైపు వెళ్తారా?
ఇక డిజిటల్ ప్రిస్క్రిప్షన్ల వైపు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఈ నిర్ణయం బలంగా గుర్తుచేస్తోంది. చాలా దేశాల్లో ఇప్పటికే ఈ-ప్రిస్క్రిప్షన్ సాధారణంగా మారింది. డాక్టర్ కంప్యూటర్లో టైప్ చేసిన ప్రిస్క్రిప్షన్ నేరుగా ఫార్మసీకి వెళ్తుంది. ఇందులో రాత సమస్యే ఉండదు. మన దగ్గర కూడా అలాంటి వ్యవస్థ విస్తృతంగా అమలులోకి రావాల్సిన సమయం వచ్చిందని ఈ ఆదేశం చెప్పకనే చెబుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇకపై ఇంగ్లీష్ వచ్చినవారంతా ఏ జబ్బుకు ఏ మందు ఇచ్చారో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అన్న భావన. ఇది కొంత వరకు నిజమే అయినా, దీని వల్ల స్వయంగా మందులు వాడే ప్రమాదం కూడా ఉంది. డాక్టర్ రాసిన మందును అర్థం చేసుకోవడం ఒకటి, డాక్టర్ లేకుండా అదే మందును మళ్లీ వాడడం మరోటి. అందుకే ఈ మార్పుతో పాటు రోగులకు సరైన అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది.
మొత్తానికి డాక్టర్ల గజిబిజి రాతలకు పెట్టిన ఈ బ్రేక్ ఒక సానుకూల అడుగు. ఇది చిన్న నియమంలా కనిపించినా, ఆరోగ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెరగడానికి ఇది కీలకంగా మారొచ్చు. రోగి కూడా తన చికిత్సలో భాగస్వామి కావాలంటే, మొదట అతడికి తన చేతిలో ఉన్న చీటీ అర్థం కావాలి. ఆ దిశగా ఈ నిర్ణయం ఒక మంచి ప్రారంభమే.